ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ముదిరాజ్ ను అనూహ్యంగా ఎమ్మెల్సీ చేశారు. ప్రకాష్ ముదిరాజ్ ను ఎమ్మెల్సీ చేయడం వెనక ప్రధాన కారణం ఆయన్ను ఈటెల రాజేందర్ స్థానంలో మంత్రివర్గంలోకి తీసుకోవడమే అని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ ముదిరాజ్ రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవిత ను రాజ్యసభకు పంపుతారని ముందు నుంచి ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా ఈ రాజ్యసభ స్థానాన్ని కెసిఆర్ తనకు అత్యంత సన్నిహితుడు అయిన... నమస్తే తెలంగాణ పత్రిక ఎండి దామోదర రావు కు ఇస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రాజ్యసభ స్థానాన్ని ముందుగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి కి ఇస్తారని అనుకున్నారు. అయితే ఆయన ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేయడంతో ... ఇప్పుడు కేసీఆర్ దామోదరరావు ను రాజ్యసభకు పంపుతున్నారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దామోదర రావు పేరు అధికారికంగా ఖరారు కానుంది.
ఇక దామోదర్ రావు సీఎం కేసీఆర్ సొంత సామాజిక వర్గం అయిన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పటికే వెలమలకు టీఆర్ ఎస్ లో ఎక్కువ పదవులు ఇస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అయినా కూడా కేసీఆర్ అవేవి పట్టించు కోకుండా మరోసారి దామోదర్ రావుకు కీలక పదవి కట్టబెడుతున్నారు.