దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ సేవలను ఇప్పటికే చాలా పార్టీలు వినియోగించుకొని ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని సైతం చేపట్టాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పీకేతో కలిసి పనిచేసారు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు సైతం ఆయన సేవలు వినియోగించుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ కూడా పీకే టీమ్ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. గత కొద్దిరోజులుగా దీనిపై ప్రచారం జరుగుతున్నప్పటికీ సరైన ఆధారాలు మాత్రం బయటకు రావడం లేదు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో పీకే టీమ్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారినది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పీకే టీమ్తో ఈ భేటీలో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన ఎలా ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ విధానపరమైన నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఏమిటనే అంశాలను సేకరించేలా కేసీఆర్ చర్చించారని సమాచారం. దీనితో పాటు ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ తరుణంలోనే పార్టీ యంత్రాంగం, నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు సహా ఇతర పథకాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పేర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం కల్పించుకుని ప్రాంతీయ పార్టీల సాయంతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించాలన్నది కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే టీఆర్ఎస్ అధినేత పీకే టీమ్ను భేటీ అయినట్టు తెలుస్తుంది. వరుసగా తెలంగాణలో మూడవసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ రాబోయే రోజుల్లో పీకే టీమ్ సేవలను పూర్తిస్థాయిలో పొందే యోచనలో ఉన్నారని సమాచారం.