అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కాకలు తీరిన యోధుడు ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం మర్రి చెన్నారెడ్డి.  పరిపాలనలో మిలటరీ డిసిప్లేన్ ను అమలు పరచిన వ్యక్తి స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డి. సబ్జక్టు పై పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఎవరూ కూడా ఆయన దరిదాపుల్లోకి  వెళ్లే వారు కాదు. ఆయన నేతృత్వంలోని మంత్రి వర్గంలో నంబర్ 2 స్థానం ఆర్థిక శాఖ దే. 1989లో మర్రి చెన్నా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక  రాష్ట్ర బడ్జెట్ను సభ ముందుకు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రోశయ్య ప్రవేశ పెట్టారు. అధికార పక్షంలో నే అసమ్మతి ఎక్కువగా ఉన్న రోజులవి.  అయనా రాష్ట్ర ఆర్థిక విషయాలను పూర్తిగా అవగతం చేసుకుని నాటి బడ్జెట్ ను రోశయ్య సభ ముందుంచారు. రెండు రోజులపాటు చర్చలు జరిగాయి. సభలో రోశయ్య సమాధానం విని ప్రతిపక్ష సభ్యులు సైతం మిన్నకుండిపోయారు. నాటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ పరిపాలించినంత కాలం ఆర్థిక శాఖ రోశయ్య గుప్పిట్లోనే ఉండింది. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్యకు తొలి సారి అమాత్య పదవి దక్కింది. ఆరంభంలో ఆయన గృహ నిర్మాణ శాఖ, రవాణా శాఖ చూశారు. 1982 లో  రాయలసీమ పెద్దాయన గా పేరు తెచ్చుకున్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో ఏకంగా హోం శాఖనే నిర్వహించారు. ఆ తరువాత  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. తెలుగుదేశంపార్టీ పాలనా పగ్గాలు చేపట్టింది.  తెలుగు దేశం పార్టీలో నాడు కీలకంగా వ్యవహరించిన నేతలంతా కూడా ఆర్థిక పరమైన విషయాలలో రోశయ్య సలహాలు, సూచనలు తీసుకునే వారు. అప్పుడు మీడియా అత్యుత్సాహంగా లేని కారణంగా  ఈ విషయాలు ప్రపంచానికి  అంతగా తెలిసేటివి కావు. ఆ తరవాత మర్రి చెన్నా రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయాలలో సీనియర్ అయిన రోశయ్యకు నంబర్ 2 స్థానం దక్కింది. ఆర్థిక శాఖ ఆయన గుప్పిట్లోకి వచ్చింది. నాటి నుంచి ఆయన అంకిత భావంతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే వారు. మధుపరులకు బడ్జెట్ పై ధీమా కలిగించే వారు. కేంద్రంలో సోంత  పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై ఎప్పుడు కూడా ఉదాశీనత ప్రదర్శించే వారు కాదు. అందు వల్లనే కాంగ్రెస్ పార్టీ కి ఇష్టుడయ్యారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగాఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సార్లు  రాష్ట్ర బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టే అవకాశం కలిగింది.




మరింత సమాచారం తెలుసుకోండి: