జవాద్ తుఫాన్ అనంతర పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. తుఫాను పరిస్థితులను పరిశీలించుటకు సంతబొమ్మాలి మండలం కారిపేట తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు.  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అందిస్తున్న ఆహారపదార్థాలను పరిశీలించారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అదే సమయంలో తుఫాను అనంతరం పరిస్థితుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాలకు గోడలు తడిసిపోయి ఉండవచ్చని, గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగవచ్చని, విద్యుత్ తీగలు క్రిందకు ఉండవచ్చని వాటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలకు వర్షపు నీటితో తాగునీరు కలిసి కలుషితం కావడం వలన పలు వ్యాధులు సంభవించే అవకాశాలు ఉంటాయని వాటిని పరిశీలించాలని అన్నారు.

నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్. ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణం సంబంధిత వైద్య అధికారిని కలవాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో సమస్య ఉంటే వాటిని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని చెప్పారు. అధికారులకు సహకారం అందిస్తూ తుఫాను సమయంలో సురక్షితంగా ఉండుటకు ప్రయత్నించాలని కలెక్టర్ అన్నారు. ఇక తుఫాను ప్రభావిత మండలాల ఆస్థి నష్ట వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు.  జవాద్ తుఫాన్ సందర్భంగా భారీ వర్షాలు కురిసిన నేపధ్యంలో ఆస్థి, తదితర నష్ట వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో సమీక్షించారు. తుఫాను తర్వాత.... బాధితులకు తక్షణమే సహాయం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: