మొన్న వంశీ క్షమాపణలు చెప్పారు.. నిన్న టోన్ డౌన్ అయింది కొడాలి నానికి కూడా! ఏదో జరుగుతోంది. వైసీపీలో దిద్దుబాటు కారణంగా చాలా మార్పులు వస్తున్నాయి. పోనీ ఈ విధంగా అయినా నాయకులు కాస్త నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడితే మేలు. మహిళలను కించపరచకుండా మాట్లాడితే ఇంకా మేలు.
భువనేశ్వరి అక్క కాళ్లు కన్నీళ్లతో కడుగుతానని అంటున్నారు ఓ వైసీపీ ఎమ్మెల్యే. సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యే చెప్పిన మాటలు ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలోచింపజేసేవే కానీ అలా సాధ్యమా? రాజకీయంలో తిట్టుకోవడం అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం అన్నవి ఇటీవల కాలంలో సర్వ సాధారణం అయిపోతున్న తరుణాన సీఎం సొంత మనిషి ఇలా అనడం బహుశా! పొలిటికల్ మైలేజీ కోసం కాదు కదా!
అప్పుడప్పుడూ మంచే జరుగుతుంది. అప్పుడయినా చెడు విలువ మాట విలువ చెడగొట్టిన విషయం అర్థం అయి ఉంటుంది. ఇ ప్పుడు ఆంధ్రావని రాజకీయాలు అన్నీ మాట విలువను చెడగొట్టేవే కనుక మనం అన్నీ విని కొన్ని వదిలి మిగతావాటిలో కొంత మంచి ఏరుకుని ముందుకు పోవడం ఖాయం చేసుకోవాలి. ఏపీ రాజకీయాల్లో గతంలో కన్నా భిన్నంగా పరిణామాలు సాగుతున్నాయి. అవశేషాంధ్ర రాజకీయాలలో ఎన్నడూ లేనంత అసహనం ఉంది. కోపం ఉంది. పగ ప్రతీకారం అన్నవి కూడా ఉన్నాయి. ద్వేషం ఎలానూ ఉండనే ఉంది. అందుకే రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా సెన్సేషన్ అయిపోతున్నాయి. వారేం చెప్పినా కూడా అవన్నీ పెద్ద పెద్ద వివాదాలుగా మారిపోతున్నాయి.
ఇంతటి అసహనంలోనూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచముల్లు శివ ప్రసాద్ రెడ్డి స్టేట్మెంట్ చదవాలి. వినాలి. ఆడవాళ్లను కించపరచడం తప్పే అని భువనేశ్వరి తనకు అక్క అని చెబుతూ కొన్ని మాటలు వినిపించారు. ఇప్పుడీ మాటలే వైసీపీలో హాట్ టాపిక్ అయ్యాయి. మహిళలను కించపరచడం తప్పే అని కూడా ఆయన అన్నారు. బాగుంది ఈ మాటలే విని మిగతా వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కాస్త హుందాతనంతో మాట్లాడతారేమో అని ఆశించడం తప్పు కాదు. అత్యాశ అంతకన్నా కాదు.