- పనితీరు బాలేదని విమర్శలు వస్తున్న వైనం
- పొత్తులు కుదిరితే ఈ సారి కాపు సామాజికవర్గం
బలపడనుంది
రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ఎప్పుడు తన ముద్ర వేయాలనుకున్నా ఏదో ఒక గండం ఎదురువుతూనే ఉంది. అందుకే ఇక్కడ బీజేపీ పాగా వేయడం అనుకున్నంత సులువు కాదు. బీజేపీ మహిళా మోర్చాను బలోపేతం చేయాలన్నా, యువ మోర్చాను బలోపేతం చేయాలన్నా కావాల్సింది కాస్త కాదు చాలా శ్రద్ధ. అసలు అనుబంధ విభాగాలకు నాయకత్వాలు లేకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని? ఈ నేపథ్యంలో వీర్రాజు క్రియాశీల రాజకీయాల్లో నుంచి త్వరలో తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో పురంధరి రానున్నారని సమాచారం.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సోము వీర్రాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అంటే ఔననే ఆయన మాటలు ధ్రువీకరిస్తున్నాయి. తనకు పదవులపై వ్యామోహం లేదని కూడా తేల్చేశారు. 2024 తరువాత తాను ఎన్నికలకు, రాజకీయాలకు దూరంగా ఉంటానని అంటున్నారు. ఉన్నట్టుండి ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ బాధ్యతలు నిర్వహించడంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీని పటిష్ట రీతిలో నడపడంలో ఆయన వైఫల్యం చెందారని కూడా అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంత కాలం కొంత జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా ఈయన మాత్రం ఏ పాటి కూడా ఆయన స్థాయిలో పనిచేయలేదు అన్న వాదన వినిపించింది. మొన్న బద్వేలు ఎన్నికలకు సంబంధించి కాస్త గొంతుపెంచి అరిచినా కూడా అదేమంత ప్రభావం చూపలేదు. ఈ తరుణంలో పార్టీ ఎప్పటి నుంచో ఆయనను అధ్యక్ష పీఠం నుంచి తప్పించాలనే చూస్తోంది. ఈ క్రమంలో బీజేపీకి కొత్త బాస్ ఎవరన్నది కూడా ఆసక్తిదాయకంగానే ఉంది. ఎలక్షన్ టీంలో సోము వీర్రాజు ఉండకపోవచ్చన్న వాదన బలీయంగా వినిపించడంతోనే ముందు జాగ్రత్తగా ఆయనీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
గత కొద్దికాలంగా వచ్చే ఎన్నికల సమయానికి మళ్లీ టీడీపీతో పొత్తుకు బీజేపీ సన్నద్ధం అవుతోంది. వీరిద్దరూ పవన్ తో జతగట్టనున్నారు. అయితే నాటి పొత్తులు ఇప్పటి పొత్తులు కాస్త వేర్వేరుగానే ఉండే అవకాశం ఉంది. జనసేన కు చెప్పుకోదగ్గ సీట్లు దక్కించేలా టీడీపీ మరియు బీజేపీ కృషిచేస్తేనే పొత్తుకు విలువ. లేదంటే మళ్లీ జనసేన నామమాత్ర పొత్తుకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ తరుణాన 20204లోగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరి సీన్ లోకి రావొచ్చు. ఒకవేళ ఆమె సీన్ లోకి వస్తే దగ్గుబాటి నారా కుటుంబాలు కలిసి పనిచేస్తాయా? అన్నది ఓ ఆసక్తిదాయక చర్చ. మొన్నటి వేళ అసెంబ్లీలో తన సోదరి భువనేశ్వరిని ఉద్దేశించి కొందరు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు అనుచిత వ్యాఖ్యలను బాహాటంగానే ఖండించిన పురంధరి తరువాత పరిణామాల్లోనూ నారా కుటుంబానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అలానే దగ్గుబాటి కూడా నందమూరి కుటుంబం విషయమై సానుకూలంగానే ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు (పురంధరి భర్త, రచయిత) ఇటీవల అఖండ సినిమా చూశాక బావను అభినందనలతో ముంచెత్తారు. ఇవన్నీ పరిగణిస్తే వచ్చే ఎన్నికల్లో పురంధరి నాయకత్వంలో బీజేపీ, నారా కుటుంబంతో కలిసి పనిచేయడం ఖాయం. వీలుంటే బాలయ్య తరుఫున వసుంధర (ఆయన భార్య) కూడా ప్రచారానికి వస్తే రావొచ్చు. సో .. సోము వీర్రాజు పుణ్యమాని నారా, దగ్గుబాటి కుటుంబాలకు స్నేహం కుదరనుందన్న మాట!