గేదె గడ్డిపై కూడా స్కాం అంటే అది మనదేశంలోనే జరిగి ఉండొచ్చు, అదొక ప్రత్యేకతగా చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడక తప్పదు మరి. మరో అడుగు ముందుకు వేసి, స్మశానాలను కూడా కబ్జా చేసి, వాటిపై కూడా వ్యాపారాలు చేసుకునే గొప్ప రాజకీయ సంస్కృతి మన వాళ్ళకే చెల్లింది. దాదాపుగా ఈ కబ్జా విషయం గురించి ఆలోచిస్తుంటే, చైనా లో ఒక్క జిన్ మాత్రమే ఉన్నాడు, భారత్ లో దాదాపు ప్రతి నేత ఒక జిన్ లాగానే కనిపించిందంతా తనదే అంటూ బొక్కేస్తున్నాడు. అందుకే మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశమైనప్పటికీ అది అభివృద్ధి చెందింది, మనం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాం.
దేనికైనా మన నేతలకు ఉన్న అన్ని రికార్డులు ఎవరికీ ఉండబోవు కాబోలు. నేర చరిత్ర కాడినుండి, స్కాం వరకు, కబ్జాల నుండి కొట్లాటల వరకు అన్నిటిలో మన వాళ్లదే పై చేయి. ఇందుకు గర్వపడదామంటే, దీనిని గుర్తించి అవార్డులు ఇచ్చే వారు ప్రపంచంలో లేకపోతిరి. అలాంటి అవార్డులు ఇస్తే, చైనా ఒలింపిక్స్ లో సాధించిన దానికంటే ఎక్కువగా మనకు పతకాలు వచ్చేస్తాయి. ఏదీ వదలకుండా తినాలనేది వాళ్ళను చూసే నేర్చుకోవాలి. అనాధ ఆశ్రమం, స్మశానం, బలహీనుడి స్థలాలు, దేవాదాయ భూములు, చెరువులు కూడా ఇలా ఏదీ కూడా వదలకుండా వాడేసుకోవడం మనవాళ్లకంటే బాగా ఎవరికీ తెలియదు. మన నేతలకు ఇలాంటివి తెలుసుకానీ, ప్రజా సేవ మాత్రమే తెలియదు. బహుశా రాజకీయాలు అంటే ప్రజాసేవ అనే అర్ధం మార్చి, దానికి ఇంకో అర్ధం చెప్పేస్తున్నారు. ఇలా వాళ్ళు పరోక్షంగా చెపుతున్నప్పటికీ, ప్రజలకు అర్ధం కావడం లేదు. గొర్రెలు కూడా దారిలో గొయ్యి వస్తే పక్కకు పోతున్నాయి. ఈ రాజకీయాలు, ప్రజలు మారేదెప్పుడో!