బీజేపీలో ఇవాళే తీర్థం పుచ్చుకున్నారు మల్లన్న (పూర్తిపేరు : చింతపండు మల్లన్న, ఆన్ స్క్రీన్ నేమ్ : తీన్మార్ మల్లన్న). గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ బీజేపీకి ఈ పరిణామం కాస్త ఉత్సాహం ఇచ్చి ఉంటుంది. హుజురాబాద్ విజయం అంతా ఈటెల ఖాతాలోకి పోవడంతో బీజేపీ శ్రేణులు ఓ వైపు ఆనందంగా ఉన్నా మొదట్నుంచి ఉన్న బీజేపీ నాయకులు మాత్రం ఆనందంగా లేరు. వ్యక్తుల ఇమేజ్ కారణంగా పార్టీ నెగ్గుకు రావడం వల్ల పార్టీకి పెద్దగా కలిసివచ్చేదేమీ ఉండదని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రాక బీజేపీ ముఖచిత్రాన్ని ఏ మారకు మార్చనుంది. ముఖ్యంగా తెలంగాణ వాకిట బీజేపీ బలోపేతానికి ఏ విధంగా మార్చే అవకాశం ఉందన్నది ఇప్పుడొక చర్చ.
బీజేపీలో చేరిన వారందరూ ఇంకా చెప్పాలంటే కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న నాయకులే టీఆర్ఎస్ గూటి నుంచి వెళ్లారు. తొలి రోజుల్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా నడుచుకున్న ఈటెల రాజేందర్ కానీ లేదా రఘునందన్ కానీ మంచి ఇమేజ్ ఉన్నావారే. విజయశాంతి కూడా మంచి రాజకీయమే నడిపి గులాబీ దండు నుంచి విడిపోయి బీజేపీ చెంతకు చేరిపోయారు. చింతపండు నవీన్ తాజా చేరికపై అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకే బీజేపీ గూటికి చేరిన జర్నలిస్టు సంగప్ప, మరో మాజీ జర్నలిస్టు రఘునందన్ మాదిరిగానే నవీన్ చేరిక ఆయన రాజకీయ జీవితాన్ని ఏ మేరకు మలుపు తిప్పనుందో కాస్త ఆసక్తిదాయకంగానే ఉంది. ఇప్పటికే కేసీఆర్ ను అనేక బహిరంగ వేదికల్లో తిడుతూ, వివిధ కేసులు బనాయించినా సరే ఆయన వెనక్కు తగ్గకుండా పోట్లాడుతూ కాస్తో కూస్తో ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్నారు. బీజేపీలో చేరాక ఆయన పంథా ఇలానే కొనసాగుతుందా అంటే కావొచ్చు.. ఎందుకంటే బీజేపీ పెద్దగా నోరేసుకుని మాట్లాడేవారు లేరు. ఓ వేళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా
పదవి అందుకుంటే గులాబీ దండుపై వాగ్బాణాలు సంధించడం ఖాయం.