రాజకీయాల్లో ఏ నాయకుడైన ప్రజలకు హామీలు ఇస్తే...ఆ హామీలని పూర్తిగా నెరవేర్చేలా ఉండాలి. ఏదో అధికారంలోకి రావడానికి ముందు ఎడాపెడా హామీలు ఇచ్చి...ఆ తర్వాత వాటిని అమలు చేయకపోతే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు. అది ఏ నాయకుడునైనా సరే...ఇచ్చిన మాట తప్పితే ప్రజలు గుర్తు పెట్టుకుని మరీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తారు. ప్రజలు సత్తా ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసనే చెప్పాలి. ఆయన 2014 ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చారో అందరికీ తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలని అమలు చేయకపోవడం వల్ల 2019 ఎన్నికల్లో ఏమైందో కూడా తెలిసిందే.

అయితే 2019 ఎన్నికల ముందు కూడా జగన్...అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చాక జగన్ ఆ హామీలని నెరవేరుస్తున్నారా? అంటే అన్నీ మాత్రం నెరవేర్చడం లేదనే చెప్పాలి. బాబు కంటే బెటర్ గానే హామీలు నెరవేరుస్తున్నారు గానీ...కొన్ని హామీల విషయంలో మాట తప్పుతున్నారు. మరి ఈ మాట తప్పే విషయంలో నెక్స్ట్ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ విషయం పక్కనబెడితే...ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉండగానే...ఇప్పటినుంచే బాబు ప్రజలకు హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇటీవల ఓటీఎస్ పేరిట...గత ప్రభుత్వాల హయాంలో కట్టిన ఇళ్లకు రూ.10 వేలు, రూ.20 వేలు కడితే...ఆ ఇళ్లని లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. అదేంటి ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం ఏంటని ప్రజలు ఎదురుతిరుగుతున్నారు. ఇదే క్రమంలో ప్రజలు ఎవరు డబ్బులు కట్టొద్దని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని బాబు హామీ ఇస్తున్నారు.

అయితే బాబు హామీని ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు అలాగే రైతుల, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, బ్యాంకులకు ఎవరు డబ్బులు కట్టొద్దని బాబు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ హామీని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా అలాగే హామీ ఇస్తున్నారు...దీన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్తితిలో కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: