ఇక తెలంగాణలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని వచ్చే ఎన్నికల్లో అధికారం చేజెక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈటలను కేంద్రంగా చేసుకుని ప్రణాళికలు రచిస్తోంది. ఈటల రాజేందర్ కమళం పార్టీకి కీలకమైన సలహాలు, సమాచారంతో పాటు సూచనలు ఇస్తున్నట్టు సమచారం. ఇటీవల ఆ పార్టీ కీలకనేతతో సమావేశమైన ఈటల ఆ మేరకు కాషాయ పార్టీ పెద్దలకు ముఖ్యమైన సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బలం పెంచుకోవడానికి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు బీజేపీ పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.
అయితే, బలమైన నేతలను పార్టీలో చేర్చుకునే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి పార్టీ కండువా కప్పాలని ఈటల బీజేపీ పెద్దలకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ వాదాన్ని రగిలించే ప్రయత్నం చేస్తారాని అప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలో ఉద్యమం చేసిన వారు ఉంటే బాగుంటుందని ఈటల పార్టీ పెద్దలకు సూచించినట్టు సమాచారం. దీంతో బీజేపీకి తెలంగాణలో ఈటల కీలక అస్త్రంగా మారిపోయాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈటలకు కేంద్ర బీజేపీ మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించిందని, త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.