దీనిపై ఆ బృందం తుది నివేదిక సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం ఏపీ అదనంగా ఆర్థిక సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హోం శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. విపత్తులు సంభవించినపుడు బాధితులను ఆదుకోవలసిన ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంటుందని, విపత్తు తీవ్రతరమైనదిగా కేంద్ర బృందం నివేదికలో పేర్కొంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి రాష్ట్రానికి అదనంగా ఆర్థిక సహాయం అందిస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. ఏ విపత్తును కూడా జాతీయ విపత్తుగా ప్రకటించే అధికారం ఎస్డీఆర్ఎఫ్ లేదా ఎన్డీఆర్ఎఫ్కు ఉండదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని 4 గిరిజన ఉత్పత్తులకు జీఐ ట్యాగ్..
ఏపీలోని నాలుగు గిరిజన ఉత్పాదనలు జీఐ ట్యాగ్ పొందడానికి అర్హమైనవిగా గుర్తించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరూట ప్రకటించారు. రాజ్యసభలో బుధవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 177 గిరిజన ఉత్పాదనలు జీఐ ట్యాగ్ పొందడానికి అర్హమైనవిగా ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) గుర్తించిందని తెలిపారు. అందులో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన ఉత్పాదనలు 88 ఉండగా, ఉత్తరాఖండ్లో 14, జార్ఖండ్లో 11, మధ్యప్రదేశ్లో 11, మహారాష్ట్రలో 10, ఒడిషాలో 6, పశ్చిమ బెంగాల్లో 9, గుజరాత్లో 7, చత్తీస్ఘడ్లో 7, ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయని వివరించారు. అస్సాం, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని 21 గిరిజన ఉత్పాదనలకు జీఐ ట్యాగింగ్ చేసే పనిని ట్రైఫెడ్ ఒక ఏజెన్సీకి అప్పగించినట్లు వెల్లడించారు.