2023 లో జరిగే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ఉవ్విళ్లూరు తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రతిపక్షాలు ఉసూరుమంటూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ముందు వరకు అసలు ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు అయినా ఉంటారా ? అన్న సందేహం ఉండేది. బిజెపి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరారు.
ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే గా ఉన్న చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వేములవాడ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రమేష్ బాబు పోటీ చేయరని తెలుస్తోంది. దీంతో వేములవాడ సీటుపై లక్ష్మీనరసింహారావు కన్ను పడిందని తెలుస్తోంది. వాస్తవానికి లక్ష్మీ నరసింహారావు కరీంనగర్ ఎమ్మెల్యే గా లేదా ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు.
అయితే కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ... కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోటీలో ఉండడంతో ఇప్పుడు లక్ష్మీనరసింహారావు కన్ను వేములవాడపై పడినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం కూడా వేములవాడ నియోజకవర్గం లోనే ఉంది. లక్ష్మీ నరసింహారావు కేసీఆర్ సొంత సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. ఆయన టిక్కెట్ హామీతోనే పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.