సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తు పురోగతిపై సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సీబీఐ విచారణ తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి కొత్త విషయాలు లేవని, గూగుల్‌లోకి వెళ్తే అందరికీ తెలిసిన విషయాలే సీబీఐ అఫిడవిట్‌లో వివరించారని హైకోర్టు తరపున వాదిస్తున్న స్టాండింగ్‌ కౌన్సిల్‌ అశ్వినీ కుమార్‌ చెప్పారు. పంచ్‌ ప్రభాకర్‌కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచ్‌ ప్రభాకర్‌ బంధువులు ఎవరు? ఏపీలో, దేశంలో ఆస్తులు ఎక్కడ..ఏంటి అనే అంశాలపై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేకపోయిందని అశ్వినీ కుమార్‌ ప్రశ్నించారు. నిందితుల పరస్పర అప్పగింతలో భాగంగా సీబీఐ ఎందుకు పనిచేయలేకపోతోందని ప్రశ్నించారు. తమకు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌ తగిన సమాచారం ఇవ్వడం లేదని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సీబీఐ అడిగిన సమాచారాన్ని తాము ఎప్పటికప్పుడు ఇస్తున్నామని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ తరపు న్యాయవాదులు వివరించారు. దీంతో సీబీఐ తీరుపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

విదేశాల్లో కూర్చుని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ, వ్యక్తులపై విమర్శలు చేస్తుంటే ఎలా సహిస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. మన వ్యవస్థల సత్తా ఏమిటో చూపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. సీబీఐ తీసుకుంటున్న చర్యలేమిటి, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్‌ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో  వివరిస్తూ జనవరి 25లోపు పూర్తి స్థాయి అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ధర్మాసనం అదేశించింది. ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి... కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పూర్తి స్థాయి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక దశలో సీబీఐ దర్యాప్తు తీరుపై అశ్వనీ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. సీబీఐకి మరో నెల రోజులు సమయం ఇద్దామని,  అఫిడవిట్‌ను పరిశీలించిన తరువాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిద్దామని ధర్మాసనం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: