నలుగురు మంత్రులు వివాదాలు తమ ఇంటి పేరుగా చేసుకుని బతికేస్తున్నారు. వారంతా స్వామి భక్తిలో భాగంగా ఇతరులను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. దీనివల్ల జగన్ జరగరాని నష్టం జరుగుతున్నా కూడా నష్ట నివారణ చర్యలు అయితే ఆయన చేపట్టడం లేదు. అందుకనో ఎందుకనో చాలా మంది బాహాటంగానే పార్టీ నేతలపై విరుచుకుపడుతూ వారి భాషపై తమ అభ్యంతరాలు తీవ్ర స్థాయిలో చెప్పేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఈ మాటలు జీర్ణించుకోలేకపోతున్నా రు అన్నది వాస్తవం. ఫలితంగా వారిపై దాడులకు దిగుతున్నారు ఇంకొందరు. దీంతో ఇలాంటివారిని రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఆ పని మానుకుని ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతున్నారు.
మంత్రులు ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అనుకోవడం భ్రమ. అదే కనుక జరిగితే ఈపాటికి వారు అనుకున్నవన్నీ జరిగి ఉండా లి. వారే నెగ్గి ఉండాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు. జరిగేందుకు వీలు కూడా లేదు. పేర్నినాని, కొడాలి నాని మొదలుకుని అంబటి రాంబాబు వరకూ అంతా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నవారే! రాజకీయంగా టీడీపీని ఎదుర్కొనే క్రమంలో వీరంతా నోరు జారి మాట్లాడుతున్నారు. కాదు కాదు నోటికి వచ్చిందంతా వాగుతున్నారు. దీంతో తరుచూ వివాదాలు రేగుతున్నాయి. తరుచూ వీరంతా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్నారు. రాజధాని విషయమై కానీ సినిమా టిక్కెట్ల విషయమై కానీ చంద్రబాబు ను ఉద్దేశించి మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ పార్టీ పరువు ప్రభుత్వ పరువు దిగ జారుస్తున్నాయని ప్రకాశం జిల్లా, ఒంగోలు నేత సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ మనుషులే మండిపడుతున్నారు. దీంతో ఆయన ఇంటిపై దాడికి సైతం పాల్పడ్డారు. దీంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా మారనుంది. పార్టీ ప్రజా స్వామ్యం లేదనేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనం అని ఇంకొందరు వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.