అవసరార్థం రాజకీయం అవసరార్థం స్నేహం అన్నవి ఎన్నడూ ఉండేవే! ఇదే కోవలో పవన్ కల్యాణ్ విషయ మై సాక్షి ఛానెల్ అప్పట్లో నడుచున్న తీరును విజువల్స్ తో సహా ట్రోల్ చేస్తున్నారు మెగాభిమానులు. తమ హీరోను ఉద్దేశించి మంత్రి అనీల్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా తమ మనసులు నొచ్చుకున్నాయని, వెంటనే అనీల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదంతా చాలా రోజుల కిందట సంగతి.. అప్పట్లో పవన్ భజన సాక్షి ఛానెల్ బాగానే చేసేది. అప్పటికీ ఆయన రాజకీయాల్లోకి రాలేదు. అంటే జనసేన ప్రారంభించలేదు. పీఆర్పీ విలీనం తరువాత పెద్దగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. మహా సముద్రంలాంటి కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం ఎందుకని అన్నయ్యను ఇంట వ్యతిరేకించా రే కానీ ఆ మాట కూడా ఎక్కడా వెల్లడించలేదు. తరువాత సినిమాలతో బిజీ అయిపోయాక జల్సాలాంటి హిట్ కొట్టారు. ఆ సినిమా తరువాత ఆయనకు వరుస కార్పొరేట్ యాడ్లు చేసే అవకాశం వచ్చింది. కానీ ఆయన వద్దన్నారు. నేను ఏమయినా చెడును ప్రోత్సహించే విధంగా ఏ ప్రకటనలో నటించినా దానిని నా అభిమాను లు ఫాలో అవుతారు..అందుకే నేను యాడ్స్ లో నటించను అన్నారు. అన్న మాట ప్రకారమే నటించలేదు కూడా!
కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మంత్రి అనీల్ పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఆయన తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటు న్నారని! అదే కనుక చేస్తే తమ హీరో ఎప్పుడో కోట్లకు కోట్లు కార్పొరేట్ యాడ్స్ ద్వారా సంపాదించేవారని పవన్ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. ఏది మాట్లాడినా తెలుసుకుని మాట్లాడాలని ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడడం అన్నది ఎవ్వరికీ తగదని, మాట్లాడి పరువు ఎందుకు పోగొట్టుకోవడం మంత్రి గారూ! మీరు మౌనంగా ఉంటేనే మీకు గౌరవం మరియు మాకు కూడా మనశ్శాంతి అని కూడా అంటున్నారు జనసేన అభిమానులు సోషల్ మీడియా వేదికగా...!