శీతాకాలం కారణంగా అసలే చలిచలిగా ఉన్న ఢిల్లీ వాతావరణం ఆ మంత్రుల వ్యాఖ్యలతో వేడెక్కింది. ఆ రాష్ట్ర మంత్రుల్లో వేచిచూసే ఓపిక నశించిందా ? లేక తమ పార్టీ అధినేత జారీ చేసిన హుకుం కారణమా ? తెలీదు కానీ, కేంద్ర ప్రభుత్వం పై వారు నిప్పులు చెెరిగారు. దేశరాజధాని వేదిక గా కేంద్రప్రభుత్వానికి ఏకంగా అల్టీమేటమ్ జారీ చేశారు. వారికి ఎందుకంత కోపం వచ్చింది ?
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య అప్రకటిత వార్ జరుగుతోంది. ఒక దశలో ఇది పతాక స్థాయికి చేరింది కూడా. సమస్య ఏమిటనేది అందరికీ తెలిసిన అంశమే. ధాన్యం కొనుగోలు అంశం పై ఇరు ప్రభుత్వాలు కూడా ఢీ అంటే ఢీ అన్నాయి. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిరసన కార్యక్రమానికి పిలపునిచ్చింది. ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఢిల్లీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఘర్షణకు దిగక తప్పడం లేదని తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ పార్టీ పేర్కోంటోంది.
రాష్ట్రంలో గతంతో పోలిస్తే సాగునీటి వనరులు ఎక్కువగానే లభ్యం అవుతుండటంతో రైతులు వరిసాగు పై మొగ్గు చూపుతున్నారు. అయితే పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని పేర్కోంటూ ఈ యాసంగి సీజన్ లో రైతులు వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు స్వయంగా రైతులకు పిలుపునిచ్చారు. సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో మాంచి ఊపుతో ముందుకు ఉరుకుతున్న భారతీయ జనతా పార్టీ నేతలు ముఖ్యమంత్రి మాటలకు కౌెంటర్ ఇచ్చారు. రైతులను వరి వేయవద్దని చెప్పడం ఏమిటని బిజేపి నేతలు ప్రశ్నించారు. దీంతో వివాదం ముదిరింది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణసభ్యులు ధాన్యం అంశం పై రచ్చ రచ్చ చేశారు. కేంద్ర ప్రభుత్వం వారి విజ్ఞప్తిని వినిపించుకోలేదు. కాగా కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. తాము వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నామని, తమను కేంద్రంలోని మంత్రులు పట్టించు కోవడంలేదని ఆయ వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కోనుగోలు చేయాల్సిందేనని ఆయన స్పష్టంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ వద్ద నుంచి ఇప్పటి వరకూ 60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తానని ఇండెంట్ ఇచ్చిందని, ఆ మేరకుకొనుగోలు చేసిందని, మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని తాము చేసిన విజ్ఞప్తి ఇంత వరకూ పట్టించుకోవడం లేదని ప్రశాంత్ రెడ్డి తదితర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో అరవై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. రెండు రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం రావల్సిందేనని తెగేసి చెప్పారు. ప్రభుత్వం దిగి రాకుంటే తెలంగాణ నుంచి ధాన్యం తీసుకు వచ్చి ఢిల్లీ లోని ఇండియాగేట్ వద్ద పారబోస్తామని మంత్రులు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు దేశరాజధానిలో కాక పుట్టించింది. రానున్న రెండు రోజులు ప్రభుత్వ సెలవులు. ఈ కారణంగా కార్యాలయాలు పనిచేయవు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని మీడియా జనం ప్రశ్నంచగా మంత్రులు సమాధానం దాట వేశారు.