ఆంధ్రావని రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. మనం వీళ్లను ఏమీ అనకూడదు..అసలు వీళ్లు మాట్లాడే భాషకు నైఘంటిక అర్థం వెతక్కూడదు. (ఫర్ దిస్ దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ డిక్షనరీ మీనింగ్). ఆ విధంగా చేశామే అనుకోండి మనల్ని అందరూ తిట్టిపోస్తారు. అందరూ కాకపోయినా వైసీపీకి చెందిన,కొడాలి నానికి చెందిన భజన బృందాల పనే సోషల్ మీడియాలో ఇదే కదా! కనుక మనం ఏం అన్నా కూడా ఊరుకోవడం ఉత్తమం..అదే బోడి గుండంత సుఖం.కానీ ఏదో ఒక రోజు మనుషుల్లో మార్పు వస్తుందని అనుకోవడం వింత కాదు తప్పూ కాదు.అసాధ్యం అని కూడా నిర్వచించలేం. కానీ నిన్నటి వేళ ఓ అద్భుతమే జరిగింది.
అదేంటంటే..
ఎలా అంటే...
నిన్నటి వేళ సీజే ఎన్వీ రమణ కు సంబంధించి ఆత్మీయ సమావేశాన్ని ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరియు తెలంగాణ న్యాయమూర్తులు హాజరయ్యారు. అక్కడి హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు హాజరవ్వడంతో వేదిక కళకళలాడింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎన్నడూ లేని విధంగా ఎన్వీ రమణ విషయమై కాస్త తగ్గే ఉన్నారు. వారంటే ఎక్కడా లేని గౌరవాన్ని ప్రదర్శించారు. అదే సమయంలో సీఎం జగన్ తో పాటు మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారు కూడా ఎన్నడూ లేనంతగా హుందాతనం చాటారు. ఓ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇంత హుందాగా నిర్వహించవచ్చు అన్న భావన ఒకటి సుస్థిరం చేసేలా జగన్ అండ్ కో నడుచుకున్న విధానం ఎంతైనా అభినందనీయం.