ఇప్పుడంటే ఆయన రాజకీయంలో విఫలం కావొచ్చు కానీ టీడీపీకి పూర్వ ప్రగతిని తీసుకురావడంలో ఆయన కృషి చేస్తూనే ఉన్నారు అన్నది ఓ వాస్తవం.అయితే రాజకీయంగా ఆయనను నిలువరించేందుకు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఘటనలు సొంత సామాజికవర్గంకు చెందిన నేతలే చేస్తుండడంతో చంద్రబాబుకు ఏమీ పాలుపోవడం లేదు అన్నది కూడా నిజం. గతంలో ఇలాంటి తప్పిదాలే టీడీపీ చేసింది కనుక బుద్ధి చెప్పేందుకే తామూ ఈ తరహా తప్పులను పునరావృతం చేస్తున్నామని అటు వంశీ కానీ ఇటు నానీ కానీ చెప్పుకుని తమని తాము సమర్థించుకుంటున్నారు. అవును! ఆ రోజు జగన్ ను అవమానించారు కనుక ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు.. ఇప్పుడు మీరు ఆయనను అవమానిస్తున్నారు కనుక రేపు మీక్కూడా అదే గతి, అధోగతి ఖాయం అన్నది రాజకీయ పరిశీలకుల ఉవాచ.
రాజకీయంగా లోకేశ్ ను ఢీ కొనడం అన్నది చాలా సులువు. ఆయను వాక్ చాతుర్యం లేదు అన్నది వాస్తవం.ఈ సందర్భంలో తారక్ ను సీన్ లోకి తీసుకుని రావాలని ఎప్పటి నుంచో టీడీపీలో కొందరు ప్రయత్నిస్తున్నా బాబుకు నచ్చడం లేదు. తప్పక తీసుకు వచ్చినా ఆయనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటే కొత్త తగువులు, తలనొప్పులు పుట్టుకువస్తాయి కనుక తారక్ ఇటుగా రారు. భువనేశ్వరిపై వైసీపీ చేసిన వ్యాఖ్యల విషయమై కూడా తారక్ ఆచితూచి స్పందించారు. దీంతో టీడీపీ అభిమానుల కోపానికి గురయ్యారు. పార్టీని లోకేశ్ కు అప్పగించడం ససేమీరా ఇష్టంలేని నాయకుల్లో గోరంట్ల,అచ్చెన్న లాంటి సీనియర్లు ఉన్నారన్నది వాస్తవం. కనుక తారక్ టీడీపీ కో వరం కావొచ్చు.. ఆయనను ఉపయోగించుకుంటే రేపటి వేళ అద్భుతం కూడా! ఆ విధంగా కాకుండా బుడ్డోడు..బుడ్డోడు అని వదిలేసి,లోకేశ్ ను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తే పరాభవం ఖాయం అన్నది ఇంకొందరి చంద్రబాబు శ్రేయోభిలాషుల మాట.