ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించడానికి వెళ్లనీయకుండా మరోసారి పోలీసులు నిర్భందించారని ఇది అప్ఘనిస్తానా లేదా ఉత్తర కొరియానా అని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2021 ముగింపునకు వచ్చినట్టే టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ చరమగీతం పలుకుతుందని హెచ్చరించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఉన్న రేవంత్ రెడ్డి నివాసానికి ఉదయాన్నే చేరుకున్న పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తన అనుమతి లేకుండా పోలీసులు ఇంట్లోకి ప్రవేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే మొన్న ఎర్రవెళ్లిలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేడు మరోసారి రేవంత్ను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహంతోనే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ వెన్నులో వణకు పుడుతుందని, పౌర స్వేచ్ఛను కేసీఆర్ ప్రభుత్వం హత్య చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల నేతల ఇండ్లల్లోకి పోలీసులను కేసీఆర్ ప్రభుత్వం ఉసిగొల్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందువులు, మిత్రులు ఇళ్లల్లోకి , శుభకార్యాలకు వెళ్లకుండా నిర్భంధిస్తున్నారని మండి పడ్డారు.