సినిమా టికెట్ ధర తగ్గింపుపై పెట్టే శ్రద్ధ అన్ని విషయాల్లోనూ చూపగలగాలి.కానీ దురదృష్టం ఏంటంటే ఏపీ సర్కారుకు ఇవేవీ పట్టవు.కేవలం ఒకే ఒక్క విషయమై దృష్టి సారించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనే తప్ప మరో ప్రణాళిక కానీ మరో విధమయిన మేలు చేసే పని కానీ అమలు చేయలేదు అని పెదవి విరుస్తోంది విపక్షం.తాజాగా జీఎస్టీకి సంబంధించి రేగుతున్న వివాదంలో కేటీఆర్ చాలా ఘాటుగానే స్పందించి, సంబంధింత మంత్రిత్వ శాఖపై చలోక్తులు సైతం విసిరి సమస్య తీవ్రతను గుజరాత్ పెద్దలకు అర్థం అయ్యేలా చెప్పారు.దీంతో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కూడా దిగివచ్చి ప్రస్తుతానికి తాము ఇలాంటి నిర్ణయాలు ఏవీ అమలు చేయబోమని పేర్కొని వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ పెంపు ప్రతిపాదన అన్నది ఉపసంహరించుకుంటున్నామని స్పష్టమయిన ప్రకటన చేసి సంబంధిత ఆధారిత కుటుంబాల్లో ఆనందం నింపారు. కానీ మన జగన్ సర్ దీనిపై ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
వస్త్ర వ్యాపార రంగానికి సంబంధించి కేంద్రం విధించాలనుకున్న జీఎస్టీ పెంపును నిరసిస్తూ కేటీఆర్ మాట్లాడారు.వస్త్ర వ్యాపార రంగంతో పాటు చేనేత రంగం కూడా కుదేలయిపోతుందని ఆవేదన చెందారు. ఈ నిర్ణయాన్ని వెనువెంటనే వెనక్కు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి సమాచారం పంపారు.అంతేకాదు కొన్ని చోట్ల (దుబ్బాకతో సహా) నిరసనలు కూడా చేశారు. ఇవన్నీ ఫలితం ఇచ్చి కేంద్రం ఈ నెల ఒకటి నుంచి పెంచాలనుకున్న జీఎస్టీని వద్దనుకుంది. ఐదు నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయం ను వెనక్కు తీసుకుని వస్త్ర వ్యాపార వర్గాలకూ,చేనేతలకూ కొత్త ఏడాది కానుక ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా కేంద్రం ను దార్లోకి తీసుకురావడంలో కేటీఆర్ తో సహా చాలా రాష్ట్రాల ప్రతినిధులు గొంతు కలిపి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపారు. కానీ మన రాష్ట్రం నుంచి ఒక్కరంటే ఒక్కరు పెరిగిన జీఎస్టీపై మాట్లాడనే మాట్లాడలేదు.కనీసం తగ్గించమని, వస్త్ర వ్యాపారులను, నేతన్నలను ఆదుకోవాలని ఒక్కరంటే ఒక్కరు పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదు. ఇదీ ఇవాళ్టి జగన్ సర్కారు తీరు.