అయితే, మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. వాస్తవానికి బీజేపీ ఏడాది మొదట్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల పై ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అనుసరిస్తూ ముందుకు వెళుతోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం అంతా ఆ పనిలోనే కొంతకాలంగా మునిగిపోయి ఉంది. ఈ ఎన్నికలు పూర్తయ్యే సరికి దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పైన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు ముందుండి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నాయి. అయితే ఉన్నట్టుండి కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు పెంచింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇక తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన బీజేపీ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేయడం పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా ప్రమోట్ చేసుకోవడంలో భాగంగానే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో వారి ఆటలు సాగనివ్వం అని ఆయన వ్యాఖ్యానించారు.