టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే ఎన్నికలకు సిద్ధం అయిపోతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని ఆయన కొన్ని రోజుల క్రితమే అన్నారు. మరి అలాంటి సంకేతాలు ఏమైనా వచ్చాయో లేదో కానీ.. కొన్ని రోజులుగా ఆయన ఎన్నికల కోణంలోనే మాట్లాడుతున్నారు. జగన్ కి  ఏదో అదృష్టం కలసి వచ్చి ఒక్కసారి సీఎం అయ్యారని.. ఇక ముందు ఆయనకు ఆ అవకాశమే రాదని టీడీపీ నేతలు చెబుతున్నారు.


ఇక మంత్రి కొడాలి నాని సంగతి తెలిసిందేగా.. ఆయన ముందు ఈ విషయం ప్రస్తావిస్తే.. మరోసారి చంద్రబాబుపై దండకం చదివేశారు కొడాలి నాని. ఇదే సమయంలో చంద్రబాబుకు కొడాలి నాని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. అదేంటో ఆయన మాటల్లోనే వినండి..” చంద్రబాబూ.. నీకు జీవితకాలం టైం ఇస్తున్నాను... నువ్వు  సీఎంగా జగన్‌ని దించి నువ్వు కుర్చీ ఎక్కితే నేను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా.. చంద్రబాబుకు దమ్ముంటే నా ఛాలెంజ్‌ తీసుకోవాలని కొడాలి నాని సవాల్ విసిరారు.


అంతే కాదు.. హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్, రింగురోడ్డు నువ్వే వేసినట్టు నిరూపిస్తావా అని చంద్రబాబును నిలదీసారు. చంద్రబాబు అలా నిరూపిస్తే.. నేను రాజకీయాలు మానుకుంటా అన్నారు కొడాలి నాని. కుల‌ పత్రికలు, కుల టీవీలు పెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూడొద్దని ఆయన చంద్ర బాబుకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన వైరస్, శని చంద్రబాబు అంటూ నాని మండిపడ్డారు.


ఈ అంశాలతో పాటు కొడాలి నాని మరికొన్ని షాకింగ్ కబుర్లుగా చెప్పారు. కొన్ని మీడియా సంస్థలను నిషేధిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని ప్రకటించారు. తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్‌లను బ్యాన్‌ చేస్తున్నట్లు కొడాలి నాని ప్రకటించారట.  మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇది అమలు చేస్తున్నామని కొడాలి నాని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: