బెజవాడ రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. మొన్నటివరకు టీడీపీలో పెద్ద రచ్చ నడిచింది..కానీ ఇప్పుడు పరిస్తితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని డామినేషన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు బెజవాడలో బుద్దా వర్గానికి, కేశినేని వర్గానికి పెద్దగా పడని విషయం తెలిసిందే. అసలు కార్పొరేషన్ ఎన్నిక సమయంలో రెండు వర్గాల మధ్య పెద్ద రచ్చ నడిచింది. కేశినేని అయితే..బహిరంగంగానే బుద్దా, బోండా ఉమాలపై విమర్శలు చేశారు.

ఇటు బుద్దా, బోండాలు సైతం కేశినేనిపై ఫైర్ అయ్యారు. ఇలా రెండు వర్గాల మధ్య మినీ యుద్ధం నడిచింది. ఇక దీని వల్ల బెజవాడలో పార్టీకి బాగానే నష్టం జరిగింది. విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఎన్నికల తర్వాత అయినా పరిస్తితులు చక్కబడతాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. పైగా ఎవరికి వారే పార్టీని పట్టించుకోవడం మానేశారు. దీంతో పార్టీకి ఇబ్బంది వచ్చింది.

ఇదే క్రమంలో కేశినేని..ఇంకా తాను ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పేశారు. దీంతో బెజవాడ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. అయితే కేశినేని తప్పుకుంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం నిదానంగా కేశినేనికి ప్రాధాన్యత పెంచుకుంటూ వచ్చింది...ఇదే సమయంలో రెండు వర్గాల మధ్య పెద్ద రచ్చకు కారణమవుతున్న విజయవాడ వెస్ట్ సీటు మ్యాటర్ కూడా తేల్చేశారు. ఆ సీటులో ఎవరిని ఇంచార్జ్‌గా పెట్టకుండా కేశినేని నానిని సమన్వయకర్తగా పెట్టారు.

అదే సమయంలో బుద్దా వర్గాన్ని తక్కువ చేయకుండా...బుద్దాకు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలని అప్పగించారు. దీంతో విజయవాడపై కేశినేనికి పట్టు పెరిగింది. అలాగే కేశినేని, వంగవీటి రాధాతో కూడా భేటీ అయ్యి..మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇలా బెజవాడ రాజకీయాలపై కేశినేని డామినేషన్ పెరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: