రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పీఆర్సీ 14.29 శాతాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బేరం ఇక్కడ నుంచి మొదలుపెట్టింది. సీఎస్ కమిటీతో కూడా ఇదే చెప్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదనంగా ఇస్తున్న 17 శాతం ఆర్ధిక ప్రయోజనాలు గురించి ఇటు ప్రభుత్వం గానీ, అటు సీఎస్ గానీ నోరెత్తలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రకటించిన పీఆర్సి 23 శాతానికి కుదించారు. దీంతో ప్రస్తుతం ఐఆర్ 27 శాతం తీసుకుంటున్న ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో నేరుగా 4 శాతం జీతాలు తగ్గనున్నాయి.
ఇక పదవివిరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం, ఉద్యోగుల డీఏలు ఈ నెల జీతాలతో కలిపి ఇవ్వాలని ఆదేశించడం, ఆయా వర్గాలకు సంతృప్తి కలిగించినప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. తీవ్ర అసంతృప్తి చెందిన ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. బొప్పన్న చెప్పనా.. నుంచి బండెన్నా.. అంతా తొండెన్నా అంటూ కామెంట్స్ తెగ పేలుతున్నాయి. అన్నీ ఫట్.. వేల ఉద్యోగాలు ఫట్ అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. రుణం తీర్చుకున్న ఉద్యోగ సంఘాలు అని కొందరు పోస్టులు పెట్టారు. మొత్తంమీద పీఆర్సీ తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.