స్టార్టప్లకు కేరాఫ్ తెలంగాణ
స్టార్టప్లకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని జితేంద్రసింగ్ కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021లో గొప్ప గుర్తింపు పొందాయని గుర్తుచేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు ఉత్తమంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ-గవర్నెన్స్లో మనదేశం ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దేశంలో డిజిటల్ విప్లవం మొదలైందని, ప్రపంచ డాటా పవర్ హౌస్గా భారత్ అవతరించిందని చెప్పారు.
ఐటీఐఆర్పై పునరాలోచించండి: కేటీఆర్
బెంగళూరు, అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టే, స్పేస్ రిసెర్చ్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లోనూ 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్స్పేస్ సెంటర్’ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు అదనంగా మరో రెండింటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2012-13లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను మంజూరు చేస్తే, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దాన్ని వెనక్కి తీసుకొన్నదని అన్నారు. రాష్ట్రంలో 2013-14లో రూ.57వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఇవాళ రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. తెలంగాణకు ఐటీఐఆర్ కేటాయించడంపై పునరాలోచన చేయాలని కోరారు.