రాజకీయం కారణంగా ఏమయినా జరగొచ్చు
కానీ మనం వాటిపై మాట్లాడకుండా
స్పందించకుండా ఉంటేనే మేలు
ఆ విధంగా అయితేనే మనకు గౌరవం రాజకీయాలకో మన్నన
కూడా దక్కడం ఖాయం
తెలంగాణ వాకిట కాలకేయుడు ఈ వారం వెలుగు చూశాడు.అంటే ఇంతకాలం వెలుగులో లేడని కాదు చీకట్లో ఉంటూ వెలుగును గుర్తించలేని స్థితిలో ఉన్న మన వ్యవస్థకు మరో సవాలు విసిరాడు.ఆ విధంగా కాలకేయుడు రాజ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో గౌరవ పోలీసు మరియు గౌరవ మీడియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.దీంతో కాలకేయుడి రాజ్యంలో అంతా అరాచకాలకు ఆనవాలే అని తెలిసినా, నోర్మూసుకుని పనిచేసిన పోలీసులే ఎక్కువ అని కూడా తేలిపోవడంతో మీడియా ఇప్పుడీ విషయమై చర్చోపచర్చలు తనదైన శైలిలో సాగిస్తోంది.ఇంతకూ ఈ కాలకేయుడు ఎవరు మీకుతెలుసు కదా వనమా వెంకటేశ్వరరావు అనే కొత్తగూడెం ఎమ్మెల్యే (పార్టీ : టీఆర్ఎస్) కొడుకు వనమా రాఘవేంద్ర అలియాస్ రాఘవ.. ఓ సామాన్యుడి కుటుంబాన్ని వేధించి,వేధించి ఆఖరికి ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణం అయిన ఉదంతంలో రాఘవ నిందితుడు.
ఎప్పటి నుంచో ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నా, ఎప్పటి నుంచో చీకటి సామ్రాజ్యం నడుపుతూ ఉన్నా పోలీసులు మాత్రం ఏమీ అనలేదు. ఆఖరికి అరెస్టు విషయమై కూడా చాలా డ్రామానే నడిపారు. ఆఖరికి ఆంధ్రా సరిహద్దుల్లో పట్టుకుని పాల్వంచ తరలించారు.ఆయనకు బెయిల్రావడం కూడా గ్యారెంటీ అని తెలుస్తోంది.అయితే ఈ ఘటనలో ఖమ్మం పోలీసుల పనితీరుపై బోలెడు ఆరోపణలున్నాయి.ఫిర్యాదు వస్తే స్పందిస్తాం అనే ధోరణిలోనే నిన్నటి వేళ ఆ ప్రాంత డీఎస్పీ అంటున్నారు. పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు బలంగా ఉన్నాయని తెలుస్తోంది.అందుకే వనమా వెంకటేశ్వరరావును పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయకుండ,ఆయన కుమారుడు రాఘవను మాత్రమే పార్టీ నుంచి బహిష్కరించి చేతులు దులుపుకున్నారు.
ఇంత జరిగినా కూడా పోలీసులు కేసుకు కారణం అయిన ఉదంతాలను వెలుగులోకి తెచ్చేందుకు పెద్దగా ప్రయత్నించడం లేదు అనే తెలుస్తోంది.విపక్షం కూడా తూతూ మంత్రంగానే మాట్లాడి ఊరుకుంది. బీజేపీ లీడర్ బండి సంజయ్ కానీ, కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యే వనమా రాజీనామా కోసం ఏ మాత్రం పట్టుబట్టకపోవడం గమనార్హం.