ఆర్ఆర్ఆర్... భారతదేశ చరిత్రలోనే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమా 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. ఇక ఇప్పటికే తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు జక్కన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో... ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రుధిరం, రౌధ్రం, రణం పేరుతో వస్తున్న ఈ సినిమా ప్రముఖ దర్శకుడు రాజమోళి దర్శకత్వంలో యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కోమరమ్ భీమ్ క్యారక్టర్‌లో కనిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, ఆలియా భట్ లతో పాటు హాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారు ఈ మూవీలో. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ సినిమా... ఇప్పటికే చిత్ర నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ నెల 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా... ఇప్పుడు కరోనా కారణంగా అనూహ్యంగా వాయిదా పడింది. దేశంలోని మొత్తం 5 భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.

తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా గతేడాది జూన్ నెల నుంచి వాయిదాలు పడుతూనే ఉంది. జనవరి 7న పక్కా అని ప్రకటించిన నిర్మాతలు... అటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగానే నిర్వహించారు. ఇక ఓవర్సీస్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. అంతా ఓకే... షాట్ రెడీ అనుకున్న సమయంలో యాక్షన్ బదులుగా బ్రేక్ చెప్పారు డైరెక్టర్ రాజమౌళి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి తెగ జోకులు పేలుతున్నాయి. అసలు సినిమా రిలీజ్ చేస్తారా అని కొందరు అడుగుతుంటే... ఈ గోల ఎందుకు ఓటీటీలో విడుదల చేయండి... సరిపోతుంది కదా అని కొందరు సలహా ఇస్తున్నారు. మరి కొందరైతే... సినిమా విడుదలయ్యే సమయానికి తారక్, చెర్రీ ఇలా మారిపోతారేమో అంటూ మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రోల్ మొదలు పెట్టారు. ఇప్పటికే దాదాపు ఐదేళ్ల పాటు తారక్, చెర్రీ డేట్లు నాశనం చేశావు... ఇంకేంత కాలం పాడు చేస్తావు అంటూ రాజమౌళిపై వారి అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏది ఏమైనా... జక్కన్న తన సినిమాను త్వరగా రిలీజ్ చేయకపోతే... మరెన్నో మాటలు పడాల్సి వస్తుంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: