అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ ఇద్దరూ కలిసి కానీ చేస్తున్నది ఏమీ లేదని విప్లవ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.రైతులను ఆదుకోవడంలో, నిరుద్యోగాన్ని తగ్గించడంలో కేసీఆర్ ఎప్పుడో ఫెయిల్ అయ్యారని అంటోంది జనశక్తి.ఈ క్రమంలో రెండు పార్టీలూ ఆయా ప్రభుత్వాలూ ప్రజల విషయమై సానుకూలంగా లేవన్న ఓ స్పష్టమయిన అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది జనశక్తి.
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజా వ్యతిరేక విధానాలే అమలవుతున్నాయని సీపీఐ(ఎంఎల్) జనశక్తి మండిపడుతోంది.ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను తప్పు పడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ విధానాలనూ,కేసీఆర్ విధానాలనూ ఏక కాలంలో విమర్శిస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి,తన అభిప్రాయాలను వెల్లడించింది.వాస్తవానికి ఎప్పటి నుంచో విశాఖ ఉక్కుపై వివాదం రేగుతూనే ఉంది.ఫ్యాక్టరీని ప్రయివేటైజేషన్ చేస్తారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.అందుకు అనుగుణంగానే కేంద్రం కూడా పావులు కదుపుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి.కానీ ప్లాంటులో కొన్ని వర్గాలు కేంద్రానికి లోపాయకారిగా మద్దతు ఇస్తున్నాయన్న వాదనలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరినీ దొంగలకు అమ్మకం చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉందన్న ఆరోపణను జనశక్తి తెరపైకి తెచ్చింది.దీంతో వైసీపీలో అంతర్మథనం మొదలయింది.తాము మొదట నుంచి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తుంటే జనశక్తి మాత్రం తమకు భిన్నంగా మాట్లాడడం పై వీరిలో కలవరం మొదలయింది.విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని ఇప్పటికే తమ ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూ రెండు స్థానిక ప్రభుత్వాలతో తీర్మానాలు చేయించిందని గుర్తు చేస్తున్నారు.వాటిలో ఒకటి విశాఖ జెడ్పీ, రెండు జీవీఎంసీ.అదేవిధంగా ఇప్పటికే అనేక మార్లు ప్లాంటుకు చెందిన పరిరక్షణ సభ్యులతో తాము అనేక మార్లు చర్చలు జరిపి,వీరిని ఢిల్లీకి తీసుకుని వెళ్లి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ ఏర్పాటు చేశామని అంటున్నారు వీరు.అయినప్పటికీ తమను నిందించడం తగదని వైసీపీ అంటోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పినా కూడా అవన్నీ తమకు అబద్ధాలుగానే కనిపిస్తున్నాయని జనశక్తి లేఖ ద్వారా చెబుతోంది.