పవన్ సంగతేంటి..?
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో దాదాపు సోలోగానే వెళ్లారు, వామపక్షాలు, బీఎస్పీని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ ది సింగిల్ ఎంట్రీనే అనుకోవాలి. కానీ పవన్ కి ఏమాత్రం లాభం లేదు. పోనీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అయినా పవన్ కి ఏపీలో కలిసొచ్చే అంశమేదైనా ఉందా అంటే అదీ లేదు. అటు ఓటు బ్యాంక్ పెరగలేదు, ఇటు మైనార్టీ ఓట్లు కూడా దూరమయ్యాయనే భావన జనసేనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం కుల రాజకీయాలు హాట్ టాపిక్ గానీ, మతాల వారీగా ప్రజలు ఇంకా వేరుపడలేదు. ఆ దిశగా ఇంకా ఓటర్లలో చీలిక రాలేదు. అదే సమయంలో బీజేపీకి మైనార్టీలు సపోర్ట్ ఇస్తారనే ఆశ కూడా లేదు. అందుకే బీజేపీతో కలసి ఉన్న పవన్ అలర్ట్ అయ్యారు.
2019లో జగన్ అధికారంలోకి రారు అని పవన్ ఘంటాపథంగా చెప్పారు. కానీ ఏపీ ప్రజలు జగన్ కి బ్రహ్మరథం కట్టారు. అప్పటినుంచి ఏపీ ప్రజల్ని అంచనా వేయడానికి పవన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జనాల్లో ప్రభుత్వంపై అసహనం ఉందని, వారు వైసీపీతో విసిగిపోయారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. స్థానిక ఎన్నికల్లో మాత్రం ఆ ప్రభావం కనిపించడంలేదు. దీంతో పవన్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. 2014లో లాగా టీడీపీతో కలవాలనే ఆశ, ఆలోచన కూడా పవన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పొత్తులపై, చంద్రబాబు వ్యాఖ్యలపై కుండబద్దలు కొట్టకుండా నర్మగర్భంగా స్పందించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలనాటికి పవన్ బీజేపీతో ఉన్నా లేకపోయినా టీడీపీతో కలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మైనార్టీల మద్దతు తిరిగి సాధించాలంటే బీజేపీతో పవన్ దూరం పెంచుకోక తప్పదు.