దీంతో పాటు రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్రం చూస్తుందని, కేంద్రం అవలంభిస్తున్న ప్రతి విషయంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక వడ్ల కొనుగోలు కొట్లాట లో బీజేపీని బద్నాం చేసేందుకు కారు పార్టీ నేతలు ఎంతగానో ప్రయత్నించారు. దీంతో తెలంగాణ రైతులకు బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచడంలో ఎంతో కొంత సఫలికృతమయ్యారనే చెప్పాలి. ఇక వరి ధాన్యం కొనుగోలు కొట్లాట ఎటూ తేలకపోవడంతో ఇప్పుడు తాజాగా.. మరో వ్యూహాన్ని కేసీఆర్ తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు, రైతు భీమా పథకాలతో తెలంగాణలో అధికంగా ఉన్న రైతులను తన గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్. వారిని బీజేపీకి మరింత దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడంతో మరోసారి ఎలాగైన అధికారం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడు. దీంతో రైతులను గుప్పిట్లో ఉంచుకోవడానికి ఇప్పుడు ఎరువుల ధరల పెంపుపై కాషాయ పార్టీపై కన్నెర్ర జేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంతో కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమవుతున్నారు. రైతులు నాగళ్లు ఎత్తి కేంద్రాన్ని ఎదురించాలంటూ పిలుపునిస్తున్నారు. ఎరువుల ధరల పెంపుపై బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు రెడీ అవుతున్నారు. దీంతో రైతులకు కేంద్రం వ్యతిరేకం అని ప్రచారం చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ వ్యూహం రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీని దెబ్బతీస్తుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి.