అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు పరిటాల శ్రీరామ్ మాటలు బాగా హల్చల్ చేస్తున్నాయి. టీడీపీలో సీటు గాని దక్కపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడంతో టీడీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు మొన్నటివరకు అనంత టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాగా హల్చల్ చేశాయి. ఇప్పుడు శ్రీరామ్ హాట్ టాపిక్ అయ్యారు.

అనంతలో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు పరిటాల ఫ్యామిలీ చూసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే రెండు చోట్ల పోటీ చేయడానికి పరిటాల ఫ్యామిలీ రెడీ అయిపోయింది. రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేస్తున్నారని ప్రచారం వచ్చింది. అయితే ఇటీవలే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. అది కూడా ధర్మవరం సీటు విషయంలో. రాప్తాడు ఎలాగో పరిటాల ఫ్యామిలీదే. కానీ ధర్మవరం సీటు కోసం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కూడా ట్రై చేస్తున్నారని తెలిసింది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన టీడీపీని వదిలి, బీజేపీలోకి వెళ్లారు. దీంతో ధర్మవరం బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు గోనుగుంట్ల మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకోవాలని చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయన అనుచరులు ధర్మవరం సీటు తమదే అని మాట్లాడారు. దీనికి పరిటాల శ్రీరామ్ కూడా కౌంటర్ ఇచ్చారు. పార్టీలో ఎవరైనా రావొచ్చు అని, కానీ ధర్మవరం సీటు మాత్రం తనదే అన్నారు. ఒకవేళ సీటు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని మాట్లాడారు.

దీంతో ధర్మవరం సీటు విషయంలో కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే టీడీపీ అధిష్టానంపై దీనిపై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలాగో అక్కడ శ్రీరామ్ పనిచేస్తున్నారు కాబట్టి ఆయనని కాదని సీటు గోనుగుంట్లకు ఇస్తే..టీడీపీలో కొన్ని వర్గాలు సహకరించే పరిస్తితి ఉండదు. అందుకే పరిటాలకే సీటు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు ఆయనకే సీటు ఫిక్స్ చేస్తారని సమాచారం. చూడాలి మరి ధర్మవరం సీటు చివరికి ఎవరికి ఫిక్స్ చేస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: