అధికార వైసీపీలో ఈ రెండున్నర ఏళ్లలో పలువురు ఎమ్మెల్యేలు వివాదాల్లో ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఏదొక సమయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గానీ, పలు వివాదాల్లో ఉండటం గానీ జరుగుతూ వస్తుంది. అలా వివాదాల్లో ఉంటూ వస్తున్న వారిలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఒకరు. రాజకీయంగా ఈయన ఎంత స్ట్రాంగ్ నాయకుడో చెప్పాల్సిన పని లేదు. అయితే గతంలో టీడీపీ పనిచేసిన ఈయన ఇప్పుడు వైసీపీలో కీలకంగా మారారు.

ప్రసన్న తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. ఆయన వారసుడుగా ప్రసన్న రాజకీయాల్లోకి వచ్చారు. 1994, 1999, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నికలో గెలిచారు. ఇక 2014లో ఓడిపోయిన ఆయన, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈయన వర్షన్ పూర్తిగా మారిపోయింది. అప్పుడప్పుడు అధికారులపైనే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సొంత పార్టీ నాయకుల తీరుని కూడా ఎండగట్టిన సందర్భాలు ఉన్నాయి.

ఇక చంద్రబాబుపై సైతం ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వచ్చేవారు. అలాగే టీడీపీ అనుకూల మీడియాపై దూకుడుగా విమర్శలు చేశారు. తాజాగా సినీ నిర్మాతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రసన్న చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నా సరే కోవూరులో మాత్రం ప్రసన్న స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈయనకు తిరుగులేదన్నట్లుగా కోవూరులో రాజకీయ పరిస్తితులు ఉన్నాయి.

అయితే టీడీపీ సైతం ప్రసన్నకు చెక్ పెట్టలేని పరిస్తితి ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెద్దగా పికప్ అవ్వలేకపోయారు. ఈ రెండున్నర ఏళ్లలో ప్రసన్నకు చెక్ పెట్టే స్థాయికి ఎదగలేకపోయారు. దీంతో కోవూరులో ప్రసన్న హవా నడుస్తోంది. మొత్తానికైతే కోవూరులో టీడీపీ పుంజుకోకపోవడం ప్రసన్నకు ప్లస్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: