అధికార పార్టీ అయిన వైసీపీ ఏం చెప్పినా గొప్పగా ఉంటుంది.అందుకు ఉదాహరణలు బోలెడు. ఆ పార్టీ ఏం మాట్లాడినా కూడా నమ్మశక్యంగానే ఉంటుంది..అందుకు తార్కాణాలు కోకొల్లలు.సంక్రాంతి వేళ వాతావరణం ఎంత మబ్బుగా ఉందే అదేవిధంగా మన పోలీసుల మాటలూ ఉన్నాయి. మబ్బులు తొలగితే ఆకాశంలో వివరం తేటతెల్లం అవుతుంది.కానీ ఇక్కడ ఆ విధంగా జరిగేందుకు ఛాన్స్ లేదు. సంక్రాంతికి ముందు జరిగిన ఈ హత్యకు ఇంకా ఇతర వివరాలకూ ఇప్పుడు పోలిక లేదు.పోలిక లేకపోయినా పోలీసులు చెప్పారు కనుక మీడియా అతి జాగ్రత్తగా రాసుకోవాలి.రాసుకున్న వాటిపై ఏమీ మాట్లాడకుండా ఉంటే మేలు.అంతేకానీ వాటిని మళ్లీ విశ్లేషించకూడదు. అలా చేస్తే అతి చేసినట్లు ఉంటుందని పోలీసులు అంటుంటారు.ఈ క్రమంలో తగదాలు ఎలా పరిష్కారం అవుతాయి..నిజానిజాలు ఎలా తెలుస్తాయి?
పల్నాడులో రాజకీయ హత్యకు కారణం వెతుకుతున్నారు పోలీసులు.ఈ కారణం చెప్పే క్రమంలో మరికొన్ని అపోహలు సృష్టిస్తున్నారు కూడా! గతం కన్నా ఇప్పుడు మరింత నమ్మే విధంగా ఓ కథను సిద్ధం చేశారు పోలీసులు. అదేంటంటే గుండ్లపాడు టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య ఎక్కడ తనను చంపేస్తాడో అన్న భయంతోనే ఎంపీపీ వర్గంకు చెందిన వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు.ఇది నమ్మకంగా లేనప్పటికీ హత్యకు పాల్పడిన వైసీపీ ఎంపీపీ శివరామయ్య నుంచి వీరు సేకరించిన వివరాలు మాత్రం ఇలానే ఉన్నాయని తెలుస్తోంది.దీంతో పోలీసులు చెబుతున్న వివరాలపై పలు అనుమానాలు ఉన్నాయి.వీటిని నివృత్తి చేసుకునేందుకు మీడియా ప్రయత్నించినా కూడా సంబంధిత దర్యాప్తు వర్గాలు మాత్రం తామేం చెప్పామో అదే రాసుకోవాలి అని ఓ రూల్ ను పాస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదు.