ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. సంక్రాంతి శోభ కన్నా కరోనా భయమే ఎక్కువగా అందరిలోనూ ఉంది.ఊరికి వచ్చామన్న సంబరం కన్నా ఊరి నుంచి వెళ్లేటప్పుడు ఇంటికి చేరుకునేటప్పుడు ఏ విధంగా కరోనా నుంచి తప్పించుకోవాలో అన్న ఆందోళనే ఎక్కువగా ఉంది.ముఖ్యంగా సంక్రాంతి తరువాత జరిగే జాతరలు గ్రామాల్లో విపరీతంగా ప్రసిద్ధి పొంది ఉంటాయి. ఉత్తరాంధ్ర పల్లెల్లో జాతరలు చాలా బాగా నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తరువాత జరిగే ప్రతి జాతరకూ ఓ విశిష్టత ఉంటుంది.శ్రీకాకుళం మొదలుకుని పశ్చిమ గోదావరి వరకూ జాతరలు భలే ఉంటాయి.వీటిపై కూడా ఇప్పుడు నియంత్రణ తప్పదు.ఇక ప్రధాన ఆలయాల్లో కూడా కరోనా సందర్భంగా ఇదే విధంగా ఆంక్షలు ఉన్నాయి.వీటికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు స్పష్టమయిన సమాచారం అందిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో...కరోనా వేళ సింహాచలం అప్పన్న గుడిలో ఆంక్షలు అమలవుతున్నాయి.ఏటా సంక్రాంతి సందర్భంగా గ్రామంలో జరిగే తిరువీధి కూడా నిషేధించారు. కరోనా వేళ తీర్థ ప్రసాదాల పంపిణీని కూడా వద్దనుకున్నారు. దీంతో ఏటా జరిగే సంబరం లేకపోవడంతో గ్రామస్థులు నిరాశ చెందుతున్నారు. అదేవిధంగా కొన్ని సేవలకు సంబంధించి (ఆర్జిత సేవలు) టికెట్ ధరలు కూడా సగానికి సగం తగ్గించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సంబంధించి నిబంధనలు అమలు చేస్తున్నారు. వాస్తవానికి సంక్రాంతి వేళల్లో సింహాద్రి అప్పన్న గుడికి వేలల్లో భక్తులు వస్తుంటారు. ఆయన ఉత్తరాంధ్రులకు మాత్రమే కాదు యావత్ ఆంధ్రులకూ ఇష్ట దైవం. పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్త జనం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.ఈ నేపథ్యం కరోనా వ్యాప్తి కాకుండా ఆంక్షలను విధిస్తూ నియమ నిబంధలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.