పందెం రాయుళ్లకు పోలీసులు సాయం చేస్తున్న వైనం ఇది.వినడానికి విడ్డూరంగా ఉన్నా ప్రస్తుతం ఆంధ్రావనిలో ఉభయగోదావరి జిల్లాలలో నడుస్తున్న తంతే ఇది.మూడు వందల కోట్లకు పైగా ఆడే ఈ పందాలకు సంబంధించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా కూడా నిలువరించలేకపోతున్నారు.రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయలు అత్యంత సులువుగా చేతులు మారిపోతున్నాయి. పందెంలో గెలిచిన వాళ్లంతా విజయ గర్వంతో విర్రవీగుతుంటే, ఓడినవారంతా లబోదిబోమంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఇక ఉభయ గోదావరి జిల్లాలే కాదు మారుమూల ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) లాంటి ప్రాంతాల్లోనూ కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్న కారణంగా పందెం రాయుళ్ల ఆగడాలు అంతులేకుండా పోతున్నాయి.వీటితో పందెం బరుల దగ్గర నాటు సారా విక్రయాలు కూడా జోరందుకుంటున్నాయి. కోడి పందేలతో పాటు పేకాట,కాయ్ రాజ్ కాయ్ ఇలా చాలా ఆటలు డబ్బులతో ముడిపడే సాగుతున్నాయి.అయినా పోలీసులకు మాత్రం ఇవేవీ పట్టవు.ఒకవేళ పట్టినా
నిందితులపై పూర్తి స్థాయిలో చర్యలే ఉండవు.