దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. అన్నిటికంటే ప్రధానంగా అందరి దృష్టి ప్రస్తుతం కేవలం ఆ రెండు రాష్ట్రాలపైనే పడింది. అవే ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు.... రెండు రాష్ట్రాల్లో ఒకదానితో ఒకటి పరస్పరం పోటీ పడుతున్నాయి. దీంతో యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించాయి ఆయా పార్టీలు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 86 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. సాహెబ్ నియోజకవర్గం నుంచి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని పోటీ చేస్తుండగా... అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల బరిలో దిగనున్నారు.

డిప్యూటీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సుఖజీందర్ సింగ్ రత్వా, ఓమ్ ప్రకాశ్ సోనిరే ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న డేరా బాబా మోహల్, అమృత్ సర్ సెంట్రల్ నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీలో నిలిపింది హస్తం పార్టీ. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూ సూద్ సోదరి మాలవికాకు కూడా అసెంబ్లీ టికెట్ ఇచ్చేసింది హస్తం పార్టీ. లోథా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాలవికాకు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక యూపీలో కూడా అభ్యర్థుల ఎన్నికపై కాషాయా పార్టీ దృష్టి సారించింది. వచ్చే నెల పదవ తేదీన యూపీలోని 58 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కమలం పార్టీ. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే గోరఖ్ పూర్‌లో మార్చి 3వ తేదీన ఆరో దశలో పోలింగ్ జరగనుంది. యోగీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి విడతలోని 58 నియోజకవర్గాలకు గానూ 57 మంది పేర్లతో జాబితా విడుదల చేసింది కమలం పార్టీ.


మరింత సమాచారం తెలుసుకోండి: