యువ ఎమ్మెల్యేకు హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా లేక ఆశలకు కత్తెర వేసిందా..? ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి వచ్చిన పదవి  వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి..? విశాఖ జిల్లాలో పార్టీ పటిష్టతపై వైసిపి స్పెషల్ ఫోకస్ పెట్టింది. టిడిపి రెబెల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికార పార్టీకి 11 మంది శాసన సభ్యుల బలం ఉంది.మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపించినా, రెండున్నరేళ్లు తిరిగేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణికి మధ్య గ్యాప్ పెరిగింది. పాయికరావుపేట విశాఖ దక్షిణ  నియోజకవర్గాల్లో వ్యతిరేకత రోడ్డెక్కింది. మిగిలిన చోట్ల చాపకింద నీరులా అసమ్మతి విస్తరిస్తోంది ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించడంతో వైసిపి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ, క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వాల మధ్య విభేదాలు సీరియస్ గా పరిగణించి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.

 ఎమ్మెల్యే అమర్ నాథ్ ను అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షున్ని చేశారు. ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయట. 2009 ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో కాపు నాయకత్వ బలం ఎక్కువ. వీటన్నింటినీ బేరీజు వేసుకుని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచే ఆసక్తికర చర్చ మొదలైంది. వాస్తవానికి అమర్నాథ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా బెర్త్ ఖాయమని ఎమ్మెల్యే అనుచరుల ధీమా. ఇంతలో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అనుచరులు డైనమాలో పడ్డారట. పార్టీ పదవిపై అమర్నాథ్ ఆలోచనలు ఎలా ఉన్నా,క్యాడర్ మాత్రం తమ నేతకు మంత్రి పదవి ఉన్నట్టా..?

లేనట్టా అని చెవులు కొరుక్కుంటున్నారట. డీలా పడిన వారికి ఎమ్మెల్యే సర్ది చెబుతున్నారట. చాలా జిల్లాల్లో మంత్రులే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నందున కొత్త పదవిని పాజిటివ్ సంకేతంగా చూడాలనేది పార్టీలో మరో వర్గం అభిప్రాయం. మిగిలిన జిల్లాల మాదిరిగానే అక్కడ అధ్యక్షుడిగా ఉన్న అమర్ నాథ్ కు లక్కు కలిసివస్తుందని చర్చ జరుగుతుంది. అందుకే ఎమ్మెల్యే కు వచ్చిన ప్రమోషన్ ఎంత వరకు లాభం,ఎంత వరకు నష్టం అని తూకం వేసుకొని విశ్లేషించుకునే పనిలో పడింది క్యాడర్.

మరింత సమాచారం తెలుసుకోండి: