తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2వేల 447 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 400కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22వేల 197యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 2వేల 295మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 80వేల 138టెస్టులు నిర్వహించారు.

హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 57మంది ఇన్ పేషెంట్లకు కరోనా పాజిటివ్ రాగా.. 9మంది మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో లక్షణాలు ఉన్న మరికొందరికి కరోనా టెస్టులు చేస్తుండగా.. తీవ్ర లక్షణాలున్న వారిని ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. ఆస్పత్రిలో మొత్తం 120మంది వైద్యులకు కరోనా సోకగా.. వీరిలో 40మంది పీజీ విద్యార్థులు, 38మంది హౌస్ సర్జన్లు ఉన్నారు. వీరితో పాటు 36మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సిన నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. దీంతో ఈ నెల 30 వరకు జరిగే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఉన్నత విద్యామండలి ఆదేశాలతో ఈ నెల 30 వరకు జరగాల్సిన సప్లిమెంటరీ, రెగ్యులర్ పరీక్షలను జేఎన్టీయూహెచ్ వాయిదా వేసింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే తాము పరిగణలోకి తీసుకోబోమని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది.  


మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హఢలెత్తిస్తోంది. రోజువారీ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ప్రమాదం పడే అవకాశముంది.








మరింత సమాచారం తెలుసుకోండి: