కరోనా మొదటి విడతలో లాక్డౌన్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరిగింది. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. మరికొందరి వ్యాపారాలు మూతబడ్డాయి. ఓ అంచనా ప్రకారం కరోనా ప్రారంభం నుంచి దాదాపు 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు. ఇది మనలో చాలా మందికి స్వానుభవం.. మనం చూసిన జీవితాలెన్నో.. మనకే తెలిసిన కథలు, వ్యథలు ఎన్నో.
అయితే.. పరిస్థితి అందరికీ ఒకేలా లేదు. ఈ కరోనా సమయంలో కొందరు మాత్రం విపరీతంగా సొమ్ములు వెనకేసుకున్నారు. వందల, వేల కోట్ల లాభాలు చవి చూశారు. ఆక్స్ఫామ్ అనే సంస్థ నివేదిక ఈ విషయం స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం కరోనా సమయంలో 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 ధనవంతుల ఆదాయం మాత్రం డబల్ అయిపోయిందట. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితులపై ఆక్స్ఫామ్ నివేదిక లెక్కలు చూస్తే మనకు కళ్లు తిరగడం ఖాయం.
ప్రపంచ వ్యాప్తంగా ధనికుల సంపద రూ.52 లక్షల కోట్ల నుంచి రూ. 112 లక్షల కోట్లకు చేరిందట. వీరిలో ఎలాన్ మస్క్ రూ.22.5లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.15 లక్షల కోట్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ కరోనా సమయంలో రోజుకో బిలియనీర్ పుట్టుకొచ్చాడని ఈ నివేదిక చెబుతోంది.