(ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి)
ఇవాళ అన్న‌గారి వ‌ర్ధంతి.26వ వ‌ర్ధంతి.తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాక ఆయ‌న అన్న‌ది తిరుగులేని నిజం.ఆయ‌న వినిపించిన నినాదంతో ఎంద‌రెంద‌రో పెద్ద‌వాళ్ల‌య్యారు.కొన్ని అనామ‌క ముఖాలు త‌రువాత కాలంలో స్టార్ డ‌మ్ ను తెచ్చుకున్నాయి. స‌మాజ‌మే దేవాల‌యం - ప్ర‌జ‌లే నా దేవుళ్లు అని చెప్ప‌డంతో రామారావు విజ‌య‌వంతం అయ్యారు.ఆ నివాదం జ‌నంలో బాగా పాతుకుపోయింది.అంత‌టి నినాదం మ‌ళ్లీ ఎవ్వ‌రూ వినిపించ‌లేక‌పోయారు.ఎన్టీఆర్ త‌న పార్టీ ప్రారంభానికి ముందు అనుకుంటా "నా దేశం" సినిమా చేశారు.పెద్ద హిట్.అస‌లు ఎన్టీఆర్ కు సినిమాలే మంచి పేరు తెచ్చాయి..రాజ‌కీయాలు క‌న్నా అని అనేందుకు ఎన్నో సంద‌ర్భాలూ..ఉదంతాలూ..తార్కాణాలు.ఇవాళ ఆయ‌న స్థాపించిన పార్టీ ఎలా ఉంది..ఎలాంటి మార్పుల‌కు నోచుకుంది అన్న‌వి ఒక్క‌సారి త‌లుచుకోవాలి.



బాల‌య్య అదుర్స్ : అఖండ విజ‌యాల చెంత!
ఎన్టీఆర్ కుటుంబంలో ఆయ‌న త‌రువాత రాజ‌కీయాల్లో రాణిస్తున్న పురంధ‌రి కానీ బాల‌య్య కానీ  త‌మ త‌మ ప‌రిధిలో రాణిస్తున్నారు అని చెప్ప‌డం సందేహాల‌కు తావే లేని విష‌యం.బాల‌య్య క‌న్నా పురంధ‌రి వాగ్ధార బాగుంటుంది.ఆమె మా ఊరికి వ‌చ్చారు.ఎంత గొప్ప‌గా మాట్లాడారో అని మా శ్రీ‌కాకుళం ప్ర‌జ‌లు ఓ సంద‌ర్భంలో పొంగిపోయారు.బీజేపీ మ‌హిళా మోర్చాను ఉద్దేశించి ఆ రోజు ప్ర‌సంగం ఇచ్చారామె.ఇదంతా చాలా రోజుల కింద‌టి మాట.ఇదే కోవ‌లో బాల‌య్య కూడా రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు.ప‌దవుల‌పై త‌న‌కు మ‌మ‌కారం లేద‌ని చెబుతూనే హిందూపురం రాజ‌కీయాల్లో మాత్రం తిరుగులేని స్టార్ డ‌మ్ ద‌క్కించుకున్నారు.వ‌రుస రెండుసార్లు గెలిచి త‌న స‌త్తా చాటారు.అన‌నుకూల వాతావ‌ర‌ణంలోనూ బాల‌య్య మాత్రం రాణించే తీరు అద్భుతం అని విశ్లేష‌కులు సైతం అభినందిస్తారు ఆయ‌న‌ను.


నంద‌మూరి అల్లుళ్లు : ఒక‌రు హిట్ .. మ‌రొక‌రు ఫ‌ట్ !  
బాల‌య్య,పురంధ‌రి త‌రువాతనో ముందో మ‌రో ఇద్ద‌రి ప్ర‌స్తావ‌న తేవాలి.వారే ఆ ఇంటి అల్లుళ్లు నారా చంద్ర‌బాబు నాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర రావు.ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడే ఆగ‌స్టు సంక్షోభం వ‌చ్చింది.పార్టీలో ఓ కుదుపు కూడా వ‌చ్చింది.త‌రువాత ప‌రిణామాలు ఏమైనా నారా చంద్ర‌బాబు నాయుడు చేతిలోకి పార్టీ వ‌చ్చింది.ఇక అక్క‌డి నుంచి పార్టీ ద‌శ‌,దిశ అన్నీ మారిపోయాయి.చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు..విభ‌జిత ఆంధ్రాకు ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.అదేవిధంగా సుదీర్ఘ కాలం ముఖ్య‌మంత్రిగానూ, ప్ర‌తిప‌క్ష నేత‌గానూ (ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత 2004 నుంచి 2014 వ‌ర‌కూ) పనిచేశారు.ఏ మాట‌కు ఆ మాట ప‌రిపాల‌న సంబంధ సామ‌ర్థ్యంలో చంద్ర‌బాబు ఇప్ప‌టికీ ఎందరి నుంచో ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉన్నారు.మ‌రో అల్లుడు ద‌గ్గుబాటి మాత్రం రాజ‌కీయాల్లో పెద్దగా రాణించ‌లేదు.ఆశించిన రీతిలో ప‌ద‌వులూ అందుకోలేదు.ఓ విధంగా విఫ‌ల నాయ‌కుడిగా కూడా ఆయ‌న పేరొందారు.ఎన్టీఆర్ కుటుంబంలో మ‌రో వార‌సుడు తార‌క్ ఇటుగా వ‌స్తార‌ని అంటున్నారు.కానీ అది కూడా సాధ్యం అయ్యేలా లేదు.మ‌న‌వ‌డు లోకేశ్ సార‌థ్యంలోనే పార్టీ  న‌డ‌వ‌బోతుంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టాతి స్ప‌ష్టంగా కొన్నిసంకేతాలు ఇప్ప‌టికే ఇచ్చారు.

అమ్మ పేరిట ఆల‌యం : సేవ‌ల్లో ప్ర‌థ‌మం..ఉత్త‌మం!  
ఆఖ‌రుగా ఎన్టీఆర్ జీవ‌న స‌హ‌చ‌రి ల‌క్ష్మీపార్వ‌తి ఆ మ‌ధ్య ఎన్టీఆర్ తెలుగుదేశం (ఎల్పీ) పేరిట ఓ పార్టీ పెట్టి త‌రువాత దానిని మ‌ధ్య‌లోనే వ‌దిలేసి,అటుపై కాంగ్రెస్ లో కొంత‌కాలం ప‌నిచేసి,ప్రస్తుతం వైసీపీ గూటిలో ఉన్నారు.తెలుగు అకాడ‌మీ చైర్ ప‌ర్స‌న్ గా  బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.ఇవ‌న్నీ మిన‌హాయిస్తే రాజ‌కీయ రంగ ప‌రంగా అన్న గారి  నిజ‌మైన వార‌సులెవ్వ‌రో ఈ 25ఏళ్ల‌లో ఇప్ప‌టికీ తేల‌లేదు.అదే విడ్డూరం కూడా! ఇక ఆయ‌న బిడ్డ హ‌రి కృష్ణ ఆ మ‌ధ్య క‌నుమూశారు.మ‌రోవైపు ఆయ‌నెంతగానో ప్రేమించిన రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ అనే బ్యాన‌ర్ మ‌నుగ‌డ‌లోనే లేకుండా పోయింది.ఆ బ్యాన‌ర్ స్థానంలో క‌ల్యాణ్ రామ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యాన‌ర్ పై చిత్ర నిర్మాణం కొన‌సాగిస్తున్నారు.క‌ల్యాణ్ రామ్ బిడ్డ‌లు కూడా బాల న‌టులుగా రంగ ప్ర‌వేశం చేశారు.అదేవిధంగా మిగ‌తా కుటుంబ స‌భ్యులంతా ప్ర‌త్య‌క్షంగానో,ప‌రోక్షంగానో ఎన్టీఆర్ ఆశ‌య సాధ‌న‌లో ఉండేందుకు ప‌రిత‌పిస్తున్నారు.కొంద‌రు నిశ్శ‌బ్దం అయిపోయినా కూడా బాల‌య్య మాత్రం త‌న‌దైన పంథాలో త‌న అమ్మ గారి ఆల‌యం బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి చైర్మ‌న్ గా ఉంటూ ఉన్న‌త రీతిలో సేవ‌లు అందించ‌డం ఓ శుభ ప‌రిణామం.


మరింత సమాచారం తెలుసుకోండి: