ఉండవల్లిలో ఉన్నటువంటి నివాసంలో హోం ఐసోలేషన్లో బాబు ఉన్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కూడా కొవిడ్ టెస్టులు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసారు. మరొకవైపు బాబు కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు సోమవారం కొవిడ్ నిర్థారణ అయినది. చంద్రబాబుకు కరోనా సోకినట్టు తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా స్పందించారు. కరోనా వైరస్ బారిన పడ్డ టీడీపీ అధినేత త్వరగా కోలుకోవాలని ట్వీట్ ద్వారా కోరారు. మామయ్య చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్.
చంద్రబాబుకు కరోనా సోకడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వేగంగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు వైఎస్ జగన్ ట్వీట్ చేసారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కేసులు అమాంతంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీలో నైట్ కర్ప్యూ విధించినప్పటికీ ఈ వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. తాజాగా ఏపీ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో నూతనంగా 6,996 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384కు చేరుకున్నాయి. ఒకే రోజులో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 514కు చేరుకుంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుపై చాలా రోజుల తరువాతే మాట్లాడారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఇవాళ చంద్రబాబు కరోనా బారిన పడ్డారనే తెలిసి ట్వీట్ చేసారు. ఇంతకు ముందు చంద్రబాబు అసెంబ్లీలో ఏడిచిన ఘటనపై స్పందించారు ఎన్టీఆర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య చర్చించే విషయాలు పెద్దగా ఏమి లేవు. మామయ్య, లోకేశ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసారు ఎన్టీఆర్.