ఆంధ్రావనిలో ఉద్యోగ సంఘాల్లో చీలికలు మొదలుకానున్నాయి.ఎందుకంటే పీఆర్సీకి సంబంధించి నాయకులంతా ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని అందుకే తమకు న్యాయం జరగలేదని వీరంతా ఆరోపిస్తున్నారు.కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించిన జీఓ కాపీలను ఇప్పటికే చించి వేసి మరీ తమ నిరసనలు తెలుపుతున్నారు.ఉద్యోగ సంఘ నాయకులను నమ్ముకోవడం తమ తప్పు అయిందని మిగతా వర్గాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి.కొందరైతే బండి శ్రీను (ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు) లాంటి వారు అమ్ముడుపోయారన్న వాదన కూడా వినిపిస్తున్నారు.ఈ తరుణంలో ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నాయి.
గతంలో ఉన్న విభేదాలన్నీ ఒక్కొక్కటీ తెరపైకి తెస్తూ తమను నాయకత్వాలు ఏ విధంగా మోసం చేశాయో కూడా పదేపదే అంతర్మథనం చెందుతూ మీడియా ముందుకు వస్తున్నాయి.ఏ విధంగా చూసుకున్నా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో జీతాలు పది వేలు కన్నా ఎక్కువ వ్యత్యాసమే ఉందని,తమ కన్నా పొరుగు ఉద్యోగులే నయం అన్న భావన తో పాటు అందుకు తగ్గ గణాంకాలు కూడా తెరపైకి తీసుకువస్తూ వీళ్లంతా తమ న్యాయపరమైన హక్కులన్నింటినీ కాలరాసిన నాయకత్వాలపై మండిపడుతున్నారు.