తెలంగాణతో పోలిస్తే ఏపీలో జీతాలు తక్కువేనని కొత్త పీఆర్సీ కారణంగానే తామంతా పది వేల రూపాయలు చొప్పున నెలకు కోల్పోనున్నామని ఉద్యోగులు చెబుతున్నారు.అద్దె భత్యాల చెల్లింపులలో కూడా వ్యత్యాసాలు అధికంగానే ఉన్నాయని ఇవి కూడా సవరించాలని వారు కోరుతున్నారు.వీటిపై ఇప్పటికిప్పుడు ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేనని,వీలున్నంత మేరకు కొత్త మార్గదర్శకాలు అనుసారమే జీతభత్యాలు ఉంటాయని, అద్దెభత్యం చెల్లింపుల్లో కూడా ఎప్పటి నుంచో తీసుకు రావాలనుకుంటున్న మార్పులు తప్పసరిగా అంగీకరించాల్సిందేనని జగన్ అంటున్నారు.ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలు పెరుగుతున్న అద్దెలను పరిగణనలోకి తీసుకోకుండా..ప్రభుత్వం ఏ విధంగా ఉన్న పళంగా భత్యం తగ్గించగలదని ప్రశ్నిస్తున్నారు వీరు.గతంలో 20 శాతం హెచ్ఆర్ఏను సాధించుకున్న రోజు ఇంకా గుర్తుందని, కృష్ణా జిల్లా,మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాలకు సంబంధించి తాము కోరుకున్న విధంగా అద్దెభత్యం చెల్లించేందుకు ఆ రోజు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారని, ఇప్పుడు మాత్రం పూర్తిగా శ్లాబ్ సిస్టంనే మార్చేశారని ఉద్యోగులు వాపోతున్నారు.
అద్దె భత్యం వివరాలిలా ఉన్నాయి :
- ఢిల్లీలో ఏపీ భవన్,ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి 24 శాతం
- విశాఖ,నెల్లూరు,గుంటూరు,విజయవాడ, సచివాలయంలో పనిచేసే సిబ్బందికి 16శాతం
- మిగిలిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ 8 శాతం హౌస్ రెంట్ అలెవెన్స్ ను నిర్ణయించారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారమే వీటిని నిర్ణయించామని ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ధ్రువీకరిస్తున్నాయని ప్రధాన మీడియా చెబుతోంది.
- ఉద్యోగుల వాదన అనుసరించి లక్ష జనాభా ఉన్నప్రాంతాలలోఇప్పటిదాకా 14 శాతం అద్దెభత్యం చెల్లించారని అంటున్నారు.
- రాజధానిలో పనిచేసిన ఉద్యోగులకు కూడా ఆశించిన విధంగానే అద్దెభత్యం చెల్లించారని వివరిస్తున్నారు.
- విభజన నేపథ్యంలో కొందరు హైద్రాబాద్ ను వీడి రాలేకపోయినందున ఆ రోజు చంద్రబాబు పాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులు ఏం చెప్పినా వాటి అన్నింటికీ ఒప్పుకున్నారని, ఇప్పుడు అవి చెల్లవని వైసీపీ అంటోంది.
- ఈ విధంగా ఏవేవో వాళ్ల తరఫున వాదనలు ఉద్యోగులు చెబుతూ వస్తున్నారు.
- అద్దెభత్యాల్లోనే కాదు జీతభత్యాల్లో కూడా తేడాలు చాలా ఘోరంగా ఉన్నాయని ఉద్యోగులు లెక్కలు కట్టి మరీ! వివరిస్తున్నారు.