కారుణ్య నియామకాలకు సంబంధించి కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన కొలువుల భర్తీకి సంబంధించి నిన్నటి వేళ కాస్తో కూస్తో ఏపీ సర్కారు కరుణ చూపించింది. కానీ మరణించిన కుటుంబాలకు కేంద్రం ఇచ్చిన డబ్బులను మాత్రం ఇచ్చేందుకు మనసొప్పడం లేదు.దీంతో పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వం దారి చూపాలని కోరుకుంటున్నారు.ఇదే సందర్భంలో సుప్రీం జోక్యం చేసుకుని ఇవాళ ఏపీ సర్కారుపై సీరియస్ అయింది. కేంద్రం తరఫున డబ్బులు విడుదలయినా ఇవ్వడం లేదన్న విషయం ఎట్టకేలకు ఈ ఘటనతో తేలిపోయింది. ఏపీ సర్కారు పరువు అత్యున్నత న్యాయ స్థానంలో పోయింది కూడా!
కరోనా పరిహారం చెల్లింపులో తాత్సారం జరుగుతుందంటూ ఏపీ సర్కారు తీరును తప్పుపడుతూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు జాప్యం జరుగుతుందో చెప్పాలని సీఎస్ ను నిలదీసింది.దీంతో కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి తనదైన వివరణ ఇచ్చుకున్నారు.చెల్లింపులో జాప్యం వాస్తవమేనని అంగీకరించారు. వెంటనే చెల్లిస్తానమని అన్నారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి చేసి తమ నివేదిక ఇవ్వాలని కోర్టు తెలిపింది.ఈ మేరకు సీఎస్ కు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఏపీలానే బీహార్ కూడా కరోనా పరిహారాల చెల్లింపుల్లో వెనుకంజలోనే ఉంది. మృతుల కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రం మాత్రం ముందకు రావడం లేదు అని తేలిపోయింది. ఇదే దారిలో బీహార్ కూడా ఉండడం విచారకరం.