మరి అలాంటప్పుడు ఏపీలో బీజేపీ నేతలు పరిస్తితి ఏంటి? అంటే ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే పర్లేదు...లేదంటే బీజేపీ నేతలకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. జనసేనతో పొత్తు ఉన్నా సరే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల ముందు కొందరు బీజేపీ నేతలు ఎవరు దారి వారు చూసుకోవాలని అనుకుంటున్నారని తెలిసింది. టీడీపీతో పొత్తు ఉంటే పర్లేదు...లేదంటే రూట్ మార్చాల్సిందే అని కొందరు నేతలు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీజేపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు రూట్ మారుస్తారా?అనే అనుమానాలు ఉన్నాయి. 2014లో వీరు టీడీపీ పొత్తులో భాగంగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కామినేని...కైకలూరు నుంచి, విష్ణు...విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అలాగే కామినేని...చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు.
అయితే ఆ తర్వాత టీడీపీ-బీజేపీలు పొత్తు విడిపోవడంతో వారు కూడా బయటకొచ్చేశారు. ఇక 2019 ఎన్నికల్లో కామినేని పోటీకి దూరంగా ఉండగా, విష్ణు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మాత్రం ఇద్దరు నేతలు మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. పొత్తు ఉంటే పర్లేదు..లేదంటే పరిస్తితి టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.