తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాబోయే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ఓ లేఖ కూడా రాసారు. తాజాగా మంత్రి హరీశ్ రావు మరొక లేఖను రాశారు. కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసారు రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఈ విషయంపై తాము గతంలో చేసిన అభ్యర్థనలను కూడా వివరించినట్టు తెలిపారు మంత్రి హరీశ్రావు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బకాయి రూ.900 కోట్లను ఇంకా విడుదల చేయలేదు అని.. మంత్రి కేంద్రానికి గుర్తు చేసారు. వీటిని విడుదల చేయడంతో పాటు ఈ గ్రాంట్ను 2021-22 తరువాత ఐదేళ్ల పాటు పొడగించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి. అదేవిధంగా నీతి అయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్ల సాయాన్ని వెంటనే విడుదల చేయాలని లేఖలో విన్నవించారు. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు అందులో గ్రామీణ స్థానిక సంస్థలకు 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.50229 ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఎందుకు తిరస్కరించినదో ఇప్పటికీ అర్థం కావడం లేదని మంత్రి తెలిపారు.
రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ నిర్థిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారు. వీటిని వీలు అయినంత త్వరగా విడుదల అయ్యేవిధంగా చూడాలని కేంద్రాన్ని అభ్యర్థించారు మంత్రి హరీశ్. 2019-20 తో పోల్చితే 2020-21 రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని.. ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించినది. ఆర్థిక సంగం సిఫారసులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవు అని.. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ నిధులను మంజూరు చేయాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రయోజిత పథకాల్లో రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరమైన 2014-15 కేంద్రం వాటాను పొరపాటున తెలంగాణకు కాకుండా ఏపీకి విడుదల చేసారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఏపీకి వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఏపీ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇంకా ఈ గ్రాంట్ తెలంగాణకు సర్దుబాటు చేయలేదు. మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదల చేయాలని కేంద్రప్రభుత్వంను కోరారు మంత్రి హరీశ్రావు. వీటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా సర్దుబాటు చేయాల్సిందిగా లేఖలో మంత్రి వివరించారు.