ఇప్పటికైనా టీడీపీ న్యాయ పోరాటం వైపు ఆలోచన చేయాలి..పరువు వాళ్లే కాదు మీరూ పొగొట్టుకుంటున్నారన్న సంగతి వెంకన్న లాంటి వ్యక్తులు తెలుసుకుని తీరాలి.అంతేకాదు తగాదాల కారణంగా పార్టీలు బలపడవు అన్న సంగతి ఇరు పక్షాలూ తెలుసుకుంటే ఇంకా మేలు. నాని అయినా వెంకన్న అయినా తగ్గాల్సిందే!
వైసీపీని టార్గెట్ చేయడంలో టీడీపీ రాజకీయ ప్రయోజనాలే వెతుక్కుంటోంది కానీ ప్రజా ప్రయోజనాలు వదిలేసింది.ఒకనాడు టీడీపీ వేరు ఇప్పుడు వేరు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అన్నవి అప్పుడూ ఇప్పుడూ ఉండేవే కానీ బుద్ధా వెంకన్న మాదిరిగా ఇంత దిగజారుడు భాష ఎందుకు వస్తుందని? అంటే అధినేతపై అంత ప్రేమ ఉందా వీళ్లకు..అదే ఉంటే విజయవాడలో టీడీపీ ఓటమికి కారణమే బుద్ధా వెంకన్న అని అంటారే.. మరి! ఆ రోజు వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలు కానీ వాటిపై వచ్చిన కౌంటర్లు కానీ అప్పుడే ఎలా మరిచిపోతాం.
అంటే చంద్రబాబు ఇంటిని వైసీపీ ముట్టడించకూడదు.. అదేవిధంగా చంద్రబాబును వైసీపీ ఏమీ అనకూడదు అని చెప్పం కానీ అదంతా రాజకీయంగా నడిపే డ్రామా కనుక అందులో తప్పొప్పుల గోలకు పోకుండా ఒకే ఒక్క విషయం వాళ్లైనా,వీళ్లైనా గుర్తు పెట్టుకుంటే మేలు. రాజ్యాంగ సంబంధ పదవుల్లో ఉన్న వ్యక్తుల విషయమై గౌరవం తగ్గించి మాట్లాడడం వెంకన్నకే కాదు ఏ స్థాయి వ్యక్తులకూ తగదు. అదే సందర్భంలో వర్ల రామయ్య కూడా! తగ్గే ఉండాలి. వంగలపూడి అనిత కూడా తగ్గే ఉండాలి.వాళ్ల భాష కూడా అస్సలు బాలేదు. కొడాలి నాని భాష కు పోటీగా వీళ్లంతా తమదైన పదజాలం వాడుతున్నామని నిరూపించుకుంటున్నారా ఏంటి? అసలీ తగాదాల వల్ల మీడియాకు స్టఫ్ అందుతుందే తప్ప! ప్రజలకు ఏం ప్రయోజనం?
క్యాసినో నిర్వహణ ఉందో లేదో అన్నది తేల్చాల్సింది పోలీసులు. అవును!వెంకట కృష్ణ అనే ఓ జర్నలిస్టు కూడా ఇదే అంటున్నాడు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తరఫున ఇదే అంటున్నాడు. కాదనం కానీ క్యాసినోను మించిన ప్రజా సమస్యలు ఉన్నాయి కదా! వాటిపై మీరెందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నారు జనసేన సభ్యులు. అంటే ప్రజా సమస్యలు అన్నీ గాలికొదిలేసి వారంరోజులుగా ఒకే ఇష్యూపై మాట్లాడుతున్న టీడీపీ పై జనసేనకు కూడా సదభిప్రాయం లేదనే తేలిపోయింది. పోనీ క్యాసినో నిర్వహణ అక్కడ జరిగిందే అనుకుందాం వాటిపై నాని మాట్లాడాల్సిన తీరు అదేనా? ఎంత కాదన్నా ఓ మంత్రి ఆయన .. పోనీ ఆయన మాట్లాడారే అనుకుందాం..టీడీపీకి ఏం అయిందని క్రమశిక్షణ విడిచి మాట్లాడితే ఇప్పుడు ఫ్యాషన్ అని భావిస్తున్నారా?
డీజీపీపై ఆరోపణలు చేయడం గొప్పేం కాదు కానీ ఆ తరువాత పరిణామాలు ఏవయినా తట్టుకునే స్థితిలో కానీ శక్తిలో కానీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉండాలి.ఉండగలగాలి.తెలంగాణ పోరాటంలో ప్రజల తరఫున వచ్చిన ఉద్యమంలో నాయకులు అలానే చాలా సమస్యలు తట్టుకుని నిలబడ్డారు. ఆ విధంగా ఆ రోజు హరీశ్ రావు కానీ మధు యాసకీ కానీ ప్రజల మన్ననలు పొందారు.అయినా గోదావరి కోడిపందాలను వదిలేసి గుడివాడ క్యాసినో గెంతులను పట్టుకున్నారేంటి? అక్కడ ఐదు వందల కోట్లు చేతులు మారాయి అని ఆరోపిస్తున్నారు మరి! ఇక్కడ అంతకుమించి జరిగి ఉంటుంది కదా! ఆపగలిగారా? అంటే కృష్ణా జిల్లాలో సంక్రాంతి రోజు ఎక్కడా పేకాట నడవలేదు. ఎక్కడా కోడి పందాలు నడవలేదు. పోనీలేండి పండగ కారణంగా వీళ్లంతా తగ్గారని అనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే వర్షం కారణంగా వీళ్లంతా వెనక్కు తగ్గారని కూడా భావిస్తాం.ఎందుకంటే మీరేం చెబితే అది మీరేం అంటే అది పాటించేందుకు ఎన్నడూ మేం సిద్ధం కనుక!