రాయని కారణంగా జగన్ సైలెంట్
కేంద్రంతో తగువుకు కారణం నిధులు
రాజకీయ ప్రయోజనాలు కూడా!
పైకి కేంద్రంతో కయ్యం పెట్టుకుంటూనే లోపల మాత్రం వియ్యం అందుకోవడంలో కేసీఆర్ సఫలీకృతం అవుతున్నారు.తాజాగా ఐఏఎస్ ల సర్వీసు నిబంధనలపై లేఖ రాసి సంచలనం అయ్యారు. గతంలో తన ప్రాంత సమస్యలు నిధుల మంజూరుపై లేఖలు రాసి చర్చకు తావిచ్చారు.ఇవన్నీ బీజేపీ కి అడ్డంకిగానే ఉన్నా కూడా పెద్దగా నోరేసుకుని పడిపోవడం లేదు.ఎందుకంటే బీజేపీ ఎంత ప్రయత్నించినా వ్యక్తుల ఛార్మింగ్ తోనే గెలవాలి కానీ పార్టీ సింబల్,సిలబస్ అన్నవి తెలంగాణలో పనిచేయవు గాక చేయవు. ఈ దశలో బీజేపీని ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి సాధించాలన్న ఆలోచన కారణంగా కేసీఆర్ హైలెట్ అవుతున్నారు.దక్షిణ ప్రాంత ముఖ్యమంత్రులతో కలుపుకుని ఫ్రంట్ రాజకీయాలు నెరపాలని ఆశిస్తూ ఉన్నారు.
కేంద్రంతో తగువేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.ఇందుకు రాజకీయ కారణాలే ప్రధానం అయినప్పటికీ ప్రాంత ప్రయోజనాలను సైతం వీటికి ముడిపెట్టి లేఖ రాశారు.ప్రధానికి లేఖ రాయడంతోనే కేసీఆర్ సెన్సేషన్ అయ్యారు.ఆ పాటి పని ఆంధ్రా సీఎం జగన్ చేయడంలో విఫలం అవుతున్నారన్న విమర్శను కూడా తెరపైకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ పరోక్ష రీతిలో కారణం అయ్యారు.ఈ దశలో కేసీఆర్ సంధించిన లేఖాస్త్రం అన్నది ట్రోల్ అవుతున్నది.ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు సాయంఅందించే విషయమై కేంద్రం వెనుకంజ వేస్తుందని హరీశ్ రావు మరో లేఖ గతంలో ఇచ్చారు. కేసీఆర్ లేఖ ఎడ్మిన్ కు సంబంధించింది..కలెక్టర్ల సర్వీసు నిబంధనల మార్పునకు సంబంధించింది కానీ హరీశ్ లేఖ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించింది..ఈ రెండూ కూడా కేంద్రాన్ని ఇరకాటంలో తోసేవే!
కలెక్టర్లను రాష్ట్రాల అనుమతి లేకుండానే కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాశారు కేసీఆర్.ఇదే కాకుండా గతంలోనూ కొన్ని లేఖలు టీఆర్ఎస్ నాయకులు రాస్తూనే ఉన్నారు.వీటిపై బీజేపీ పెద్దగా స్పందించింది లేదు.బీజేపీ స్పందించినా కూడా ఇప్పటికిప్పుడు తెలంగాణకు వచ్చిన ప్రయోజనం కూడా ఏమీ లేదు.కేసీఆర్ కేవలం బీజేపీని బెదిరించేందుకు మాత్రమే లేఖలు రాస్తున్నారు. కానీ స్వచ్ఛమయిన రీతిలో ఆయన పోరాటాలు సాగించడం లేదు అని కూడా అంటున్నాయి విపక్షాలు.