మన దేశంలో ఏ మార్పూ ఒకంతట రాదు..వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు. కనుక మార్పును కోరి సమాజంలో గొప్ప ఉన్నతిని కోరి రాజకీయ పార్టీలు తమ మనుగడ ను సాగించవు. యంత్రాంగాలు తమని తాము తీర్చి దిద్దుకోవు.కోలేవు కూడా! అందుకే చాలా చోట్ల ఇప్పటికీ సమస్యలే తప్ప పరిష్కారాలు సంబంధిత మార్గాలూ ఉండవు గాక ఉండవు. దేశాన్ని పాలించే శక్తులకు,దేశాన్ని పీడించే శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఒకప్పుడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పాలించే శక్తి పీడించే శక్తి ఒక్కటే అయింది. అందుకే మన జాతీయ పండుగలకు ఏ ప్రత్యేకతా లేకుండా పోయింది. అవార్డులు రివార్డులు ఇంకా ఇంకొన్ని ఎప్పుడూ ఉండేవే కానీ వాటికి మించి మంచి ఫలితాలను రాబట్టేందుకు మన పాలకులు చేయాల్సిన కృషి ఎప్పుడో మరిచిపోయారు. కనుక ఏ ప్రత్యేకతా లేని రోజులు ఆ రెండు. ఆ రెండూ సెలవు రోజులు కూడా! జాతీయ పండగల నాడు మన జాతి ఎవరిని స్మరించుకోవాలో కూడా తెలుసుకోవడం లేదు సరికదా కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంలోనే వింత మరియు విషాదం దాగి ఉన్నాయి. కచ్చితంగా ఇది విచారం కాదు విషాదమే!
జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం.రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.ఇంకేమయినా ప్రత్యేకతలు ఉన్నాయా? ఉంటే ఏంటవి? ఆగస్టు 15 అంటే పంద్రాగస్టు స్వేచ్ఛా స్వతంత్రాలు పొందిన రోజు..అనగా ..మనం బానిస సంకెళ్లు తెంచుకున్న రోజు.. ఈ విధంగా దీనిని అర్ధ రాత్రి స్వతంత్రం అని కూడా అంటారు.ఎందుకంటే అది రాత్రి పూట బ్రిటీషర్లు చేసిన ప్రకటన కనుక.ఇవి కాకుండా మన దేశంలో ఏమయినా మార్పులకు గొప్ప గొప్ప సంస్కరణలకు ఆనవాలుగా ఆ రెండు రోజులూ నిలుస్తున్నాయా అన్నది వెతకండి.. ఆ విషయంలో భారతీయుల వెనుకబాటును ప్రశ్నించండి.
ఇవాళ కూడా ఎక్కడో ఓ చోట ఓ కౌలు రైతు ఆత్మహత్య కు సంబంధించిన వార్త వచ్చే ఉంటుంది.ఇవాళ కూడా బడికి రాకుండా జెండా వందనం చేయకుండా టీచర్లు ఎందరో దీన్నొక సెలవు రోజుగానే చూసే వీలుంటుంది. ఈ రోజు కూడా అవినీతి అధికారి ఒకడు తన బేరం ఏదో తాను చూసుకునే అవకాశం ఉంటుంది.అలాంటప్పుడు ఇవాళ రోజుకు ప్రత్యేకత ఏమయినా ఉందా లేదా దీనిని కూడా ఓ సాదాసీదా రోజుగానే పరిగణించాలా?