పద్మశ్రీ అవార్డు అందుకోనున్న మొగులయ్య జీవితం ఎందరికో ఆదర్శం. 12మెట్ల కిన్నెర వాద్యాన్ని వాయించే అలవోకగా స్వరాలు ఒలికించే పలికించే మొగులయ్య తెలంగాణ కీర్తి కిరీటం అని రాయడంలో ఎటువంటి సంశయాలకూ తావేలేదు.ఆ మాటకు వస్తే తెలంగాణ దారుల్లో చాలా ప్రాంతాలలో మొగులయ్యను పోలిన మనుషులు కిన్నెర వాద్య కళాకారులు ఉన్నా కూడా 12 మెట్ల కిన్నెర వాద్యాన్ని అలవోకగా పలికించి వీరులగాధలు వినిపించే ఏకైక కళాకారులు మాత్రం మొగులయ్య.వాస్తవానికి మొగులయ్య ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. ఆయనను సాంస్కృతిక శాఖ ఓ సందర్భంలో సాదరంగా సతర్కించి నెల నెల పింఛను ఇస్తుంది. కానీ ఆ డబ్బు ఆయనకు చాలదు. చాలా తక్కువ మొత్తం.అయినా మొగులయ్య మన మాదిరి బాధపడడు. ఏదో లేదని ఏమీ లేదని వెలితి చెందడు. ఊరూరా తిరిగి సంచార జీవనం సాగించే మొగులయ్య ఇందాక చెప్పుకున్న విధంగానే ఆదర్శ ప్రాయుడు.
ఇక మొగులయ్యకు మొదటి సినిమా అవకాశం పవన్ ఇప్పించాడు అని చెప్పడం తప్పు అని అంటున్నారు తెలంగాణకు చెందిన కొందరు కవులు రచయితలు.ఆయనను మొదట పరిచయం చేసింది జైనీ క్రియేషన్స్ అధినేత ప్రభాకర్ జైనీ. ఆయన తన నిర్మాణ
సారథ్యంలో, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అంపశయ్య అనే సినిమాకు గాను మొగులయ్యను పిలిచి అవకాశం ఇచ్చారు. కానీ నిన్నటి వేళ ఆయన పేరునే ఎక్కడా ఏ మీడియాలోనూ ప్రస్తావించలేదు మొగులయ్య. అదే మొగులయ్య చేసిన ప్రధాన తప్పిదం. ఆయనను ఇవాళ ఎందరెందరో ఆదరిస్తున్నారు.ఆయన పాటను రికార్డు చేసి భద్రపరుస్తామని చెబుతున్నారు.సినిమాల్లో మరికొందరు పాడిస్తామని మాట ఇచ్చి వెళ్తున్నారు.ఇవన్నీ జరిగేందుకు ఓ విధంగా కారణం పవన్ కావొచ్చు..కాదనం కానీ అంతకుముందరి కారణం మాత్రం జైనీ క్రియేషన్స్ నిర్వాహకులు ప్రభాకర్ జైనీనే అన్నది నిర్వివాదాంశం.ఎనీవే పద్మ పురస్కార గ్రహీత హోదాలో ఇకపై మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని మొగులయ్య ను కోరుకుంటూ..మరొక్కమారు వారికి శుభాకాంక్షలు.